ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్లోనే సత్తాచాటాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ బౌలర్ హర్షల్ పటేల్. 27 పరుగులకే 5 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇతడు ఇంతకుముందు దేశవాళీల్లోనూ మెరిశాడు. 2012 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు హర్షల్. తర్వాత 2018లో దిల్లీ ఫ్రాంచైజీకి మారాడు. ఈ సీజన్కు ముందు జరిగిన మినీ వేలంలో తిరిగి ఆర్సీబీ ఇతడిని ట్రేడింగ్ విండో ద్వారా కనీస ధర రూ.20 లక్షలకే కొనుగోలు చేసింది. వారి నమ్మకాన్ని నిలబెడుతూ అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడీ యువ పేసర్. అయితే ఈ లీగ్లో ఇతడితో పాటు ఈసారి మరికొంత మంది ప్రతిభ గల దేశవాళీ క్రికెటర్లు కనీస ధరకే అమ్ముడు పోయారు. వారెవరో చూద్దాం.
మహ్మద్ అజారుద్దీన్ (ఆర్సీబీ)
దేశవాళీల్లో కేరళకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అజారుద్దీన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా రాణిస్తున్నాడు. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్లో 37 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ టోర్నీలో మొత్తంగా 195 స్ట్రైక్ రేట్తో 214 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ ఇతడిని కనీస ధరకు కొనుగోలు చేసింది.
సౌరభ్ కుమార్ (పంజాబ్ కింగ్స్)
కొన్నేళ్లుగా దేశవాళీల్లో సత్తాచాటుతున్నాడు ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ కుమార్. ఇప్పటివరకు 23.14 సగటుతో 192 ఫస్ట్ క్లాస్ వికెట్లు దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్కు ప్రాతనిధ్యం వహించిన ఇతడు ఆ తర్వాత మళ్లీ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఈ సీజన్ కోసం ఇతడిని పంజాబ్ కింగ్స్ కనీస ధరకు కొనుగోలు చేసింది.
విష్ణు వినోద్ (దిల్లీ క్యాపిటల్స్)
ఈ సీజన్కు ముందు జరిగిన మినీ వేలంలో కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ విష్ణు వినోద్ను కనీస ధరకు కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో సత్తాచాటాడు విష్ణు. ఇంతకుముందు లీగ్లో ఆర్సీబీకి ప్రాతనిధ్యం వహించిన ఇతడు మూడు మ్యాచ్లు కూడా ఆడాడు. ఈసారి దిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
దేశవాళీల్లో 137 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్లో రాణిస్తోన్న వెంకటేశ్ 21 వికెట్లూ దక్కించుకున్నాడు. దీనితో పాటు ఎకానమీ 7 లోపు ఉండటం ఇతడిని ఐపీఎల్కు ఎంపికయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన వెంకటేశ్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 198 పరుగులు చేసి, రెండు వికెట్లు కూడా దక్కించుకున్నాడు. అలాగే ముస్తాక్ అలీ టోర్నీలోనూ కొన్ని అద్భుత ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో ఐపీఎల్లో కేకేఆర్ దృష్టిలో పడ్డాడు.