ఐపీఎల్లో(IPL 2021) విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super kings) ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. ఎనిమిది సార్లు ఫైనల్కు చేరిన ఆ జట్టు మూడు సార్లు టైటిల్ సాధించి.. ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది. ఇందులో ఒకసారి కోల్కతా నైట్రైడర్స్(Kolkata Knight Riders) చేతిలోనే ఓటమిపాలవ్వడం గమనార్హం. 2010, 2011లో వరుసగా రెండేళ్లు కప్పు సాధించిన ధోనీసేన 2012లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూసింది. కానీ, గంభీర్ నాయకత్వంలోని కోల్కతా జట్టు దానికి అడ్డుకట్ట వేసింది. చెన్నైని ఓడించి షాకిచ్చింది.
హస్సీ, రైనా మెరుపులు..
అప్పటి మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు మైఖేల్ హస్సీ(54), మురళీ విజయ్(42) ధాటిగా ఆడి శుభారంభం చేశారు. తొలి వికెట్కు 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే విజయ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(73) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హస్సీతో కలిసి రెండో వికెట్కు 73 పరుగులు జోడించాడు.
అయితే, అర్ధశతకం తర్వాత ధాటిగా ఆడే క్రమంలోనే హస్సీ ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోనీ(14 నాటౌట్) క్రీజులోకి వచ్చి రైనాకు చక్కటి సహకారం అందించాడు. చివరి బంతికి రైనా ఔటైనా కోల్కతా ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో మ్యాచ్ ఇక చెన్నై సొంతం అని 'విజిల్ పోడు' బ్యాచ్ ఫిక్స్ అయిపోయారు. ఈల వేసి గోల చేద్దాం అని సిద్ధమైపోయారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ ఎందుకవుతుంది. చెన్నైకి కోల్కతా బిస్లా రూపంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అతనికి జాక్వెస్ కలిస్ తోడవడం వల్ల మ్యాచ్ను మూట కట్టి.. కప్పును గెలుచుకున్నారు.
బిస్లా, కలిస్ పిడుగులు..
2012 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ అంటే గౌతమ్ గంభీరే అని చెప్పాలి. అంతలా జట్టు విజయాల్లో పాలుపంచుకున్నాడు. అయితే ఈ భారీ లక్ష్య ఛేదనలో గౌతమ్ గంభీర్(2) విఫలమయ్యాడు. తొలి ఓవర్లోనే పెవిలియన్కు చేరాడు. మరో ఎండ్లో ఫైనల్ ముందు వరకు భీకర్ హిట్టర్ బ్రెండన్ మెక్కలమ్ ఉండేవాడు. అయితే ఫైనల్కు గంభీర్ అతనిని తీసుకోలేదు. దీంతో ఆదిలోనే చెన్నై మ్యాచ్పై పట్టుసాధించేలా కనిపించింది. అయితే ఊహించనవి విధంగా గంభీర్ మన్విందర్ బిస్లాపై నమ్మకం ఉంచి, అతనిని తీసుకున్నాడు. చాలా రోజులగా డగౌట్కే పరిమితమయ్యాడు, అతనేం ఆడతాడులే అని అందరూ అనుకున్నారు ఆ రోజు. కానీ బిస్లా అలా అనుకోలేదు. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచుకున్నాడు. జట్టుకు ఒంటి చేత్తో కప్ అందించాడు. బిస్లా (89), జాక్వెస్ కలిస్ (69) దంచికొట్టారు. చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో పిడుగుల వర్షం కురిపించారు. దీంతో ఇంకేముంది కప్ కోల్కతాదే అనుకున్నారంతా. ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా ఎగిరి గంతేసినంత పని చేశాడు.
ముందు చెప్పినట్లు అన్నీ అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ కాదు కదా. బిస్లా శతకానికి చేరువైన వేళ మోర్కెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో చెన్నై బౌలర్లు ఓవైపు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ, మరోవైపు కీలక సమయాల్లో వికెట్లు తీశారు. అనంతరం లక్ష్మీరతన్ శుక్లా(3), యూసుఫ్ పఠాన్(1) కూడా విఫలమయ్యారు. ఇక కలిస్ పోరాడినా విజయానికి చేరువలో ఔటయ్యాడు. దీంతో కోల్కతా విజయానికి 8 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఎలాంటి డ్రామాకు ఆస్కారం ఇవ్వకుండా మనోజ్ తివారి (9*) రెండు ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని, ట్రోఫీని అందించాడు.