తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2022, 7:21 AM IST

ETV Bharat / sports

IPL 2022: కెప్టెన్​ కోసం ఎంతకైనా.. ఐపీఎల్​ జట్ల కసరత్తు

IPL 2022: మెగావేలం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఐపీఎల్‌ జట్లు. ముఖ్యంగా కొత్త కెప్టెన్‌ కోసం చూస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ అందుకు ఏయే ఆటగాళ్లపై కన్నేశాయన్నది ఆసక్తికరంగా మారింది. సరైన కెప్టెన్‌ కోసం ఆ జట్లు భారీగానే చెల్లించే అవకాశం ఉంది.

ipl 2022
ipl 2022 teams eyeing for captains

IPL 2022: ఈ ఏడాది నుంచి పది జట్లతో సరి కొత్తగా ఐపీఎల్‌ అలరించనుంది. ధనాధన్‌ క్రికెట్‌ మజా మరింత ఎక్కువ కానుంది. కానీ అంతకంటే ముందు అందరి దృష్టి మెగా వేలంపై ఉంది. జట్లు గరిష్ఠంగా నలుగురు, కనిష్ఠంగా ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం వల్ల ఈ వేలం తర్వాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు మారిపోనున్నాయి. అందుకే జట్టులోకి ఏ ఆటగాడిని తీసుకోవాలి? ఎవరి కోసం ఎన్ని రూ.కోట్లు వెచ్చించాలి? ఎలా కొత్త సారథిని సొంతం చేసుకోవాలి? అనే వ్యూహాల్లో ఫ్రాంఛైజీలు ముగినిపోయాయి. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే మెగా వేలంలో అనుసరించాల్సిన ప్రణాళికలకు తుది మెరుగునిచ్చే పనిలో పడ్డాయి. ముఖ్యంగా కొత్త కెప్టెన్‌ కోసం చూస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ అందుకు ఏయే ఆటగాళ్లపై కన్నేశాయన్నది ఆసక్తికరంగా మారింది. విదేశీ ఆటగాళ్లలో మోర్గాన్‌, కమిన్స్‌, డికాక్‌, డుప్లెసిస్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, జేసన్‌ హోల్డర్‌.. భారత క్రికెటర్లలో అశ్విన్‌, ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌, భువనేశ్వర్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రహానె సారథి పాత్రకు సరిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీళ్లలో ఆ జట్లు ఏ ఆటగాళ్లను దక్కించుకుంటాయన్నది చూడాలి.

శ్రేయస్

వాళ్లపై ఆర్సీబీ కన్ను..

ఎనిమిది సీజన్లుగా ఆర్సీబీని నడిపించిన విరాట్‌ కోహ్లీ గతేడాది కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం నుంచి అదే జట్టుతో ఉన్న అతను.. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కానీ వచ్చే సీజన్‌ నుంచి అతను జట్టులో ఓ ఆటగాడు మాత్రమే. అందుకే కెప్టెన్‌గా ఎవరిని తీసుకోవాలనే దానిపై జట్టు యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. శ్రేయస్‌ కోసం ఆ జట్టు ఏకంగా రూ.20 కోట్లు పెట్టేందుకు సిద్ధమైందన్న వార్తలు వచ్చాయి. కానీ ఒక్క ఆటగాడి కోసం అంత చెల్లిస్తారా? అన్నది అనుమానమే. ఆ జట్టు ఇప్పటికే అట్టిపెట్టుకున్న కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ల కోసం రూ.33 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.57 కోట్లున్నాయి. మరోవైపు వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌, అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ను వేలంలో దక్కించుకోవాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అతను గొప్పగా రాణిస్తున్నాడు. దీంతో అతని కోసం జట్టు రూ.12 కోట్ల వరకూ పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

హోల్డర్

మరోవైపు అంబటి రాయుడు, రియాన్‌ పరాగ్‌లపైనా ఆ జట్టు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. "స్టోక్స్‌ అందుబాటులో లేడు. హార్దిక్‌, స్టాయినిస్‌ కొత్త జట్లలోకి వెళ్లారు. గాయాల కారణంగా మిచెల్‌ మార్ష్‌ పూర్తి సీజన్‌ ఆడతాడో లేడో చెప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌గా హోల్డర్‌కు డిమాండ్‌ ఉంది. అతని కోసం ఆర్సీబీ రూ.12 కోట్లు పక్కన పెట్టింది. అంతే కాకుండా అంబటి రాయుడు కోసం రూ.8 కోట్లు, రియాన్‌ పరాగ్‌కు రూ.7 కోట్ల వరకూ చెల్లించేందుకు సిద్ధమైంది" అని ఆర్సీబీ సమాచార వర్గాలు తెలిపాయి. ఇక తమ జట్టుకు కెప్టెన్‌గా అవకాశముంటే శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోవాలని కూడా ఆర్‌సీబీ చూస్తున్నట్లు సమాచారం. కానీ అతణ్ని కొనేంత డబ్బు ఆ జట్టు దగ్గర మిగులుతుందా అనేదే సందేహం.

ఆ రెండు ఏం చేస్తాయో..

ఇక వచ్చే సీజన్లో కొత్త కెప్టెన్ల అవసరం ఉన్న మరో రెండు జట్లు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌. గతేడాది జట్టును ఫైనల్‌ చేర్చినప్పటికీ మోర్గాన్‌ను కేకేఆర్‌ వదులుకుంది. రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌లను అట్టిపెట్టుకుంది. మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ను కూడా వదులుకున్న ఆ జట్టుకు ఇప్పుడు ఓ సారథి కావాలి. ఇక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్‌ విజేతగా నిలవని పంజాబ్‌ కింగ్స్‌ కూడా నూతన నాయకుడి కోసం చూస్తోంది. గత రెండు సీజన్లలోనూ కెప్టెన్‌గా బ్యాటింగ్‌తో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌.. ఇప్పుడు కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ సారథిగా ఎంపికయ్యాడు. మరోవైపు ఆ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ మాత్రమే జట్టుతో ఉన్నారు. రూ.72 కోట్లతో వేలంలో దిగనున్న ఆ జట్టు.. సరైన కెప్టెన్‌ కోసం భారీగానే చెల్లించే అవకాశం ఉంది.

వదులుకున్న వాళ్ల కోసం..

నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకున్నాయి. దీంతో ఇష్టం లేకపోయినా అగ్రశ్రేణి ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడలా వదులుకున్న ఆటగాళ్లను తిరిగి వేలంలో దక్కించుకోవడం కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ సిద్ధమవుతోంది. కెప్టెన్‌ ధోనీ, జడేజా, మొయిన్‌ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌లను అట్టిపెట్టుకున్న ఆ జట్టు ఖాతాలో ఇప్పుడు రూ.42 కోట్లున్నాయి. దాంతో 21 మంది ఆటగాళ్లను వేలంలో కొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జట్టు నుంచి దూరమైన బ్రావో, డుప్లెసిస్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లను తిరిగి తీసుకోవడంపై సీఎస్కే ఆసక్తి ప్రదర్శిస్తోందని సమాచారం.

ధోనీ

"వేలంలో జట్టు అనుసరించే వ్యూహాన్ని బయటపెట్టడం సరికాదు. కానీ జట్టుకు ఎంతో కాలంగా సేవ చేసిన ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవడం కోసం సీఎస్కే ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ ఆటగాళ్ల పేర్లను చెప్పలేం. నిబంధనల కారణంగా వాళ్లను వదులుకోవాల్సి వచ్చింది" అని సీఎస్కే సమాచార వర్గాలు పేర్కొన్నాయి. వేలంలో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు ధోనీ గత వారం నుంచి చెన్నైలోనే ఉన్నాడు. వేలంలో కూడా అతను జట్టుతో కలిసి పాల్గొనే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:మహిళల ఐపీఎల్​పై గంగూలీ క్లారిటీ.. 'అప్పుడైతేనే కరెక్ట్​'

ABOUT THE AUTHOR

...view details