IPL 2022 Rohit Sharma: ఐపీఎల్ మెగా టీ20 టోర్నీలో భాగంగా దిల్లీతో తలపడిన మ్యాచ్లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడిన తొలి కెప్టెన్గా రోహిత్ నిలిచాడు.
ఆదివారం జరిగిన ఈ పోరులో తొలుత ముంబయి టాస్ ఓడి బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 177/5 స్కోర్ సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (81; 48 బంతుల్లో 11x4, 2x6) దంచికొట్టాడు. అనంతరం దిల్లీ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లలిత్ యాదవ్ (48 నాటౌట్; 38 బంతుల్లో 4x4, 2x6), అక్షర్ పటేల్ (38 నాటౌట్; 17 బంతుల్లో 2x4, 3x6) చివర్లో బౌండరీల మోత మోగించి విజయాన్ని అందించారు. అయితే, రెండో ఇన్నింగ్స్లో నిర్దిష్ట సమయంలోపు ముంబయి బౌలింగ్ కోటా పూర్తిచేయకపోవడం వల్ల ఈ జరిమానా విధించారు.