తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2020, 6:00 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్2020: కింగ్స్​ ఎలెవన్ బలాలు, బలహీనతలు ఇవే!

ఐపీఎల్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ ఆటగాళ్లు కూడా నెట్స్​లో శ్రమిస్తున్నారు. ఈ మెగా లీగ్ ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది పంజాబ్. దీంతో ఈసారి కొంతమంది కొత్త ఆటగాళ్లను తీసుకుని నూతనోత్సాహంతో బరిలో దిగుతోంది. కెప్టెన్ బాధ్యతలు కేఎల్ రాహుల్​కు అప్పగించింది. మరి ఈ కూర్పు జట్టుకు కలిసొస్తుందా? ఈ సీజన్​లో అయినా కప్పు కొడుతుందా? అసలు కింగ్స్ బలాలు, బలహీతలు ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

Kings XI Punjab strengths and Weaknesses
ఐపీఎల్2020

కింగ్స్​ ఎలెవన్ పంజాబ్.. ఎపుడూ వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకోవడంలోనే బిజీగా ఉంటుంది. కానీ ఏ ఆటగాడూ ఈ జట్టుకు ట్రోఫీని అందించలేకపోయాడు. ఈసారి కూడా వేలంలో 26.2 కోట్లను ఖర్చు చేసింది. మ్యాక్స్​వెల్, జోర్డాన్, కాట్రెల్ వంటి టీ20 స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంతో జట్టును పటిష్ఠం చేసుకుంది. అలాగే యువ ఆటగాడు కేఎల్ రాహుల్​కు జట్టు పగ్గాలు అప్పగించింది. మరి ఇప్పటివరకు టోర్నీలో ఆకట్టుకోని ఈ జట్టు ఈసారైనా అలరిస్తుందేమో చూడాలి. మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పంజాబ్ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకుందాం.

పంజాబ్ షెడ్యూల్

బలాలు

గత సీజన్​లో ఈ మెగా లీగ్​ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్ ఈసారి పునరాగమనం చేశాడు. టీ20ల్లో ఇతడికి మంచి రికార్డుంది. దీంతో ఇతడు ఈ జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇతడి చేరికతో బ్యాటింగ్​, బౌలింగ్ విభాగంలో జట్టుకు సమతుల్యం ఏర్పడినట్లు అయింది.

సారథి కేఎల్ రాహుల్, విధ్వంసకర బ్యాట్స్​మన్ క్రిస్ గేల్ రూపంలో ఈ జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ కుదిరింది. గత సీజన్​లో రాహుల్ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్​లో రెండో స్థానంలో నిలిచాడు. 14 మ్యాచ్​ల్లో 53.9 సగటుతో 593 పరుగులు సాధించాడు. గేల్ కూడా 13 మ్యాచ్​ల్లో 153.6 స్ట్రైక్​ రేట్​తో 490 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ గతేడాది జట్టుకు శుభారంభాల్ని అందించారు. అదే ఫామ్​ను ఈసారి కూడా కొనసాగించాలని చూస్తున్నారు.

అప్పర్ మిడిలార్డర్​లో భారత యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, మన్​దీప్ రాణించాలని జట్టు భావిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్ తన క్రియేటిక్ షాట్స్​తో ఎప్పుడూ అలరిస్తుంటాడు. ఈ ముగ్గురి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.

భారతీయ ఆటగాళ్లు

బలహీనతలు

స్పిన్ విభాగంలో ఎంతో అనుభవం కలిగిన రవిచంద్రన్ అశ్విన్​ను వదులుకుంది పంజాబ్. ఇతడు గతేడాది 15 వికెట్లతో రాణించాడు. దీంతో ఈసారి వీరికి అనుభవం కగిలిన స్పిన్నర్ కరవయ్యాడు. మురుగన్ అశ్విన్, ముజిబుర్ రెహ్మన్​లపైనే ఈ జట్టు ఆధారపడాల్సి ఉంది. యూఏఈ లాంటి స్పిన్​ పిచ్​లపై స్పిన్నర్ల కొరత ఉండటం ఈ జట్టుకు పెద్ద బలహీనత.

పేస్​ బౌలింగ్​లో మహ్మద్ షమీ గతేడాది 14 మ్యాచ్​ల్లో 19 వికెట్లతో రాణించాడు. ఇతడికి మద్దతుగా నిలిచి చక్కటి ప్రదర్శన చేసిన సామ్ కురాన్​ను ఈసారి పంజాబ్ వదులుకుంది. ఇతడి స్థానంలో షెల్డన్ కాట్రెల్​ను తీసుకుంది. ​అలాగే స్పిన్నర్ జగదీశ సుచిత్​ను కూడా కొనుగోలు చేసింది. అయినా ఈ జట్టు బౌలింగ్ విభాగంలో అంత పటిష్ఠంగా లేదు. అలాగే ప్రధాన బౌలర్లకు గాయాలైతే బ్యాకప్ ఆప్షన్​ కనిపించడం లేదు.

విదేశీ ఆటగాళ్లు

అవకాశాలు

ఈ సీజన్​లో పంజాబ్ బ్యాటింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. గేల్​, రాహుల్ జోడీ కుదురుకుంటే మ్యాచ్​ను వారివైపు తిప్పుకోవచ్చు. అలాగే బ్యాటింగ్ విభాగంలో ఈసారి కొన్ని రికార్డులు కూడా వీరు కొల్లగొట్టే అవకాశం ఉంది. మ్యాక్స్​వెల్, మయాంక్ అగర్వాల్, మన్​దీప్ సింగ్​ రూపంలో కావాల్సినంత హిట్టింగ్ లైనప్ ఉంది. మిడిల్ ఓవర్స్​లో పరుగుల వరద పారించేందుకు పాకెట్ రాకెట్ సర్ఫరాజ్ ఖాన్ ఉండనే ఉన్నాడు. అలాగే నికోలస్ పూరన్, హార్డస్ విజియోన్, జేమ్స నీషమ్, కరుణ్ నాయర్, క్రిస్ జోర్డాన్ వంటి నాణ్యమైన టీ20 బ్యాట్స్​మన్ ఉన్నారు. దీంతో ఈసారి ఈ లైనప్ నుంచి 200కి పైగా పరుగులు ఆశించవచ్చు.

బౌలింగ్ విభాగంలో ఎలాంటి గాయాలు కాకుండా ఉంటే మహ్మద్ షమీ, ముజిబుర్ రెహ్మన్, షెల్డన్ కాట్రెల్, మురుగన్ అశ్విన్ వారి సత్తా మేరకు రాణించగలరు.

పంజాబ్ కొత్త ఆటగాళ్లు

ప్రమాదాలు

గతేడాది పరుగుల వరద పారించిన కేఎ రాహుల్​కు ఈసారి కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. దీంతో అందరి చూపు ఇతడిపైనే ఉంది. ఓ వైపు జట్టును నడిపిస్తూ బ్యాటింగ్​లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిడికి గురై తన బ్యాటింగ్ ఫామ్​ను కోల్పోతే జట్టుకు పెద్ద దెబ్బే.

ఈ జట్టుకు చెప్పుకోదగ్గ ఆల్​రౌండర్లు నీషమ్, మ్యాక్స్​వెల్, క్రిస్ జోర్డాన్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ వీరికి గాయాలైతే జట్టుకు కష్టమే.

యువ ఆటగాళ్లలో చాలా మందికి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం లేదు. అలాగే ఒత్తిడిని ఎదుర్కోవడంలో అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు.

కొసమెరుపు

గత మూడేళ్లలో వరుసగా 5,6,7 స్థానాల్లో నిలిచిన పంజాబ్ 2014లో మాత్రం ఫైనల్​కు చేరింది. తుదిపోరులో కోల్​కతా నైట్​రైడర్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్​తో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి ప్రతి సీజన్​లో దిగజారుతూ వచ్చింది. కానీ ఈసారి వేలంలో భారీ ఖర్చు పెట్టి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మరి ఈసారైనా ఈ జట్టుకు అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details