ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్ ఆదివారం మ్యాచ్ సందర్భంగా ఈ విషయమై స్పష్టతనిచ్చాడు.
ఐపీఎల్ రిటైర్మెంట్పై ధోనీ క్లారిటీ - వచ్చే సీజన్లోనూ చెన్నైకే ధోనీ
ఐపీఎల్ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన ధోనీ.. వచ్చే సీజన్లోనూ ఆడతానని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్కే మళ్లీ ప్రాతినిధ్యం వహిస్తానని వెల్లడించాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత వ్యాఖ్యాత, ధోనీని.. 'ఇదే మీకు చెన్నైతో చివరి మ్యాచా?' అంటూ ప్రశ్నించాడు. బదులిచ్చిన మహీ.. కచ్చితంగా కాదు అంటూ ఐపీఎల్ రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు.
ఈ మెగాలీగ్లో చెన్నై జట్టు వరుస ఓటములతో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. 13 మ్యాచ్ల్లో ఐదింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఓ పక్క చెన్నై ఓడుతున్నా.. మ్యాచ్ల అనంతరం ధోనీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. వచ్చే సీజన్లో అతడు ఆడటం అనుమానమేనని అందరూ అనుకున్నారు. కానీ వాటన్నింటిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు.