తెలంగాణ

telangana

'ఆ విజయంతో విదేశాల్లో ఎక్కడైనా గెలుస్తామనే కలిగింది'

By

Published : Aug 24, 2021, 10:07 PM IST

1971లో ఇంగ్లాండ్‌పై భారత్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్​ను కైవసం చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం కలిగిందని హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన ఆనాటి రోజులు గుర్తుచేసుకున్నాడు. ఇది జరిగి అప్పుడే 50 ఏళ్లు గడిచిన నేపథ్యంలో.. నాటి క్రికెటర్లు ఒక ఒరవడి సృష్టించారని అన్నాడు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్‌ అంటూ శాస్త్రి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

Ravi Shastri
రవిశాస్త్రి

టీమ్‌ఇండియా 1971లో ఇంగ్లాండ్‌పై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలిచినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదనే నమ్మకం కలిగిందని హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన చిన్ననాటి రోజులు గుర్తుచేసుకున్నాడు. ఆ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీసీసీఐ నాటి మ్యాచ్‌ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి స్పందిస్తూ ఆ రోజుల్లో తాను రేడియోలో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నానని చెప్పాడు.

"నేనప్పుడు తొమ్మిదేళ్ల కుర్రాడిగా ఉన్నా. ఆ మ్యాచ్‌ ఎలా సాగిందో నాకింకా గుర్తుంది. ప్రతి బాల్‌ను నేను రేడియో కామెంట్రీలో విన్నా. అప్పుడు ఫరూక్‌ ఇంజినీర్‌, గుండప్ప విశ్వనాథ్‌, అజిత్‌ వాడేకర్‌ తలా కొన్ని పరుగులు సాధించారు. అప్పుడు టీమ్‌ఇండియా సిరీస్‌ గెలవడం సంచలనంగా మారింది. దాంతో విదేశాల్లో ఎక్కడైనా గెలుస్తామనే ధీమా కలిగించింది. ఇక ఇంగ్లాండ్‌లో గెలవడం అనేది చారిత్రక ఘట్టం. ఇది జరిగి అప్పుడే 50 ఏళ్లు గడిచాయి. నాటి క్రికెటర్లు ఒక ఒరవడి సృష్టించారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్‌" అంటూ శాస్త్రి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.

ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా 1971లో అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు, ఓల్డ్‌ ట్రాఫర్డ్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిశాయి. ఇక ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేసింది. ఓపెనర్‌ జాన్‌ జేమ్సన్‌(82), అలాన్‌ నాట్‌(90), రిచర్డ్‌ హ్యూటన్‌ (81) రాణించారు. ఆపై భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు విఫలమైనా అజిత్‌ వాడేకర్‌(48), దిలీప్‌ సర్దేసాయి(54), ఫరూక్‌ ఇంజినీర్‌ (59), ఏక్‌నాథ్‌ సోల్కర్‌(44) పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్‌ భగవత్‌ చంద్రశేఖర్‌ 6/38 మెరవడంతో ఆ జట్టు 101 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమ్‌ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయడంతో మ్యాచ్‌ గెలుపొందింది. దాంతో ఇంగ్లాండ్‌ గడ్డపై 1-0 తేడాతో తొలిసారి టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి:IND vs ENG: 'రూట్​.. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదు'

ABOUT THE AUTHOR

...view details