తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2022, 4:59 PM IST

ETV Bharat / sports

టీమ్​ఇండియాకు సవాల్​ విసిరిన ఆ దేశ క్రికెట్​ కోచ్

భారత్​ క్రికెట్​ జట్టుకు జింబాబ్వే ప్రధాన్​ కోచ్​ డేవ్​ హౌటన్​ సవాల్​ విసిరాడు. తమ జట్టుతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. టీమ్​ఇండియాకు తాము గట్టి పోటీ ఇస్తామని తెలిపాడు.

india zimbabwe series
india zimbabwe series

IND VS ZIM: దాదాపు ఆరేళ్ల తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడేందుకు టీమ్‌ఇండియా హరారేకి బయల్దేరి వెళ్లింది. కేఎల్‌ రాహుల్ నాయకత్వంలోని భారత్‌ ఆగస్ట్‌ 18న తొలి వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ఆగస్టు 20, ఆగస్టు 22న మ్యాచ్‌లను ఆడనుంది. తాజాగా బంగ్లాదేశ్‌ వంటి జట్టును ఓడించిన జింబాబ్వే.. భారత్‌కు సవాల్ విసిరడం గమనార్హం. తమ జట్టుతో టీమ్‌ఇండియా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు జింబాబ్వే ప్రధాన కోచ్‌ డేవ్ హౌటన్.

జింబాబ్వే ప్రధాన కోచ్‌ డేవ్ హౌటన్

''గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ను చూస్తూనే ఉన్నాం. ప్రపంచ క్రికెట్‌లో టాప్‌ జట్లలో ఒకటి. అంతేకాకుండా మూడు నాలుగు జట్లను తయారు చేయగలిగే సామర్థ్యం కలిగిన దేశం. మాతో పోటీలకు వచ్చినా.. మేం మాత్రం గట్టి పోటీనిస్తాం. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం సంపాదించడానికి వినియోగించుకుంటాం. ఇదే విషయాన్ని మా జట్టు సభ్యులకు చెప్పా. భారత్‌ వంటి పెద్ద జట్టు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మంచి స్కోర్లు సాధించడంతోపాటు అద్భుత ఫలితాలను రాబట్టాలని వివరించా. అలాగే ఏదో మ్యాచ్‌ల సంఖ్యను పెంచుకోవడానికే కాకుండా టీమ్‌ఇండియాను సవాల్‌ చేసేలా గేమ్‌ ఆడాలని సూచించా. మా ఆటగాళ్లు గట్టిగా పోరాడతారనే నమ్మకం నాకైతే ఉంది. టీమ్‌ఇండియాపై సీరియస్‌గా పోటీ పడతామని చెప్పగలను. కాబట్టి పర్యాటక జట్టు మా టీమ్‌తో జాగ్రత్తగా ఉండాలి" అని డేవ్ హౌటన్ వివరించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌, మూడువన్డేల సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. కెప్టెన్‌ రెగిస్ చకబ్వా, సికందర్‌ రజా బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించారు.

వన్డే సిరీస్‌ భారత్‌తోపాటు జింబాబ్వేకు చాలా కీలకం. 2023 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాలంటే వరల్డ్ కప్‌ సూపర్‌ లీగ్‌లో రాణించాలి. 13 జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్‌లో టాప్‌-8 టీమ్‌లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు బెర్తులను క్వాలిఫయర్స్‌ మ్యాచుల్లో నెగ్గిన జట్లకు కేటాయిస్తుంది. ప్రస్తుతం (జులై 15వరకు అప్‌డేట్) భారత్‌ ఏడో స్థానంలో ఉండగా.. జింబాబ్వే 12వ స్థానంలో ఉంది. భారత్‌ ఇప్పటికే ఆతిథ్య హోదాలో క్వాలిఫై అయిపోయింది. కాబట్టి జింబాబ్వే ప్రపంచకప్‌ రేసులో నిలవాలంటే గెలిచితీరాలి. సూపర్‌ లీగ్‌లో గెలిచిన జట్టుకు పది పాయింట్లు వస్తాయి. ఓడితే మాత్రం సున్నాతో సరిపెట్టుకోవాల్సిందే.

.

జింబాబ్వే పయనమైన టీమ్​ఇండియా ఆటగాళ్లు..
జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లు శనివారం ఉదయం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్‌ ధావన్‌, దీపక్‌ చహర్‌, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ విమానంలో బయల్దేరిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. హరారే వేదికగా ఈ నెల 18న మొదటి మ్యాచ్‌, 20న రెండో మ్యాచ్‌, 22న ఆఖరి మ్యాచ్‌ జరుగుతుంది. ఆసియాకప్‌ ఈ నెల 27న ప్రారంభం కానుండటంతో ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో ధావన్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపికచేసిన విషయం తెలిసిందే.

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్‌ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చాహర్‌.

జింబాబ్వే జట్టు: రెగిస్‌ చకబ్వా (కెప్టెన్‌), ర్యాన్ బర్ల్‌, సికందర్‌ రజా, తనకా చివాండా, బ్రాడ్లీ ఎవన్స్‌,ఇన్నోసింట్‌ కైయా, లుకే జాంగ్వే, క్లివ్‌ మదన్‌డే, వెస్లే మదివేర్‌, జాన్‌ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌, విక్టర్‌ నగర్వా, విక్టర్‌ నౌచీ, మిల్టన్‌ శుంబా, డొనాల్డో తిరిపానో.

ఇవీ చదవండి:దక్షిణాఫ్రికా టీ20 లీగ్​లో ధోనీ బీసీసీఐ అధికారి ఏం చెప్పారంటే

చరిత్ర సృష్టించిన తెలంగాణ రెజ్లర్​ నిఖిల్‌

ABOUT THE AUTHOR

...view details