తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind w vs Ban W Third ODI : భారత్‌, బంగ్లా మూడో వన్డే టై.. సిరీస్‌ సమం

Ind w vs Ban W Third ODI : టీమ్ఇండియా, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే డ్రాగా ముగిసింది. ఇరు జట్లు మూడు వన్డేల సిరీస్ 1-1తో ముగించాయి. దీంతో రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి.

By

Published : Jul 22, 2023, 5:45 PM IST

Updated : Jul 22, 2023, 7:48 PM IST

India W Tour Of Bangladesh 2023
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వన్డే ట్రోఫీ

Ind w vs Ban W Third ODI :ఐసీసీ ఛాంపియన్​షిప్​లో భారత్‌, బంగ్లాదేశ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా జట్టు 225 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఇరు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. కాగా భారత బ్యాటర్ హర్లీన్​కు 'ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్' అవార్డు దక్కగా.. ఈ మ్యాచ్​లో సెంచరీతో అదరగొట్టిన బంగ్లాదేశ్ ప్లేయర్​ ఫర్గానా హోక్ (107)కు ప్లేయర్ ఆఫ్​ ది సిరీస్ అవార్డు లభించింది.

వన్డే ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు

226 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక మిడిలార్డర్​లో వచ్చిన హర్లీన్​ (77).. ఓపెనర్ స్మృతి మంధాన(59) ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్​కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. కానీ స్మృతి.. ఫహిమా బౌలింగ్​లో ఔట్ అయ్యింది. తర్వాత కెప్టెన్ హర్మన్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అప్పటి నుంచి ఓ వైపు హర్లీన్ పోరాడుతున్నా.. మరో ఎండ్​లో ఆమెకు సహకారం లేదు. ఇక ఆమె ఇన్నింగ్స్ 42 ఓవర్లో రనౌట్​ అయ్యి పెవిలియన్ చేరడం వల్ల భారత్ కష్టాలు పెరిగాయి.

గత మ్యాచ్ విన్నర్ జెమిమా.. పోరాడటం వల్ల కొద్దిగా ఆశలు చిగురించాయి. ఇక చివర్లో భారత్ విజయానికి 18 బంతుల్లో 10 పరుగులు కావాలి​. చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉండడం వల్ల గెలుపు భారత్​దే అని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా 48 ఓవర్లో టీమ్ఇండియా ఒక పరుగే చేసి.. రెండు వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్లో 3 పరుగులే కావాల్సిన దశలో రెండు పరుగులు చేసిన భారత్ మూడో బంతికి చివరి వికెట్ కోల్పోయి.. మ్యాచ్​ను డ్రాగా ముగించింది.

అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్​ను అద్భుతంగా ఆరంభించింది. ఓపెనర్లు సుల్తానా (52), ఫర్గానా (107)తో మెరిశారు. వీరిద్దరూ తొలి వికెట్​కు 93 పరుగులు జోడించారు. తర్వాత భారత బౌలర్లు పుంజుకొని పరుగులను కట్టడి చేశారు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. నిర్ణీత 50 ఓవర్లకు 225 పరుగులు చేసింది. కాగా భారత బౌలర్లలో స్నేహ్ రానా రెండు, దేవికా వైద్య ఒక వికెట్ తీసుకున్నారు. ఇక ఈ పర్యటనలో భారత్ టీ20 సిరీస్​ను 2-1తో కైవసం చేసుకోగా.. తాజా వన్డే సిరీస్​లో 1-1తో సంయుక్త విజేతగా నిలిచింది.

Last Updated : Jul 22, 2023, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details