ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసింది. 1-2 తేడాతో సిరీస్ను చేజార్చుకొని టీమ్ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఈ టోర్నీలో ఆసీస్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడితే కోహ్లీసేన మాత్రం తడబడుతూ ముందుకు సాగింది. స్టీవ్స్మిత్ రెండు శతకాలు, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ అద్భుతమైన ఓపెనింగ్లు ఆకట్టుకున్నాయి. ఇక విధ్వంసకర వీరుడు గ్లెన్ మాక్స్వెల్ బాదిన సిక్సర్లు మాత్రం అందరినీ కట్టిపడేశాయి. అతడు రివర్స్స్వీప్లో బాదిన షాట్లకు విశ్లేషకులైతే ఫిదా అయిపోయారు.
ఐపీఎల్-13లో మాక్స్వెల్ పంజాబ్కు ఆడాడు. అందులో 13 మ్యాచులు ఆడినప్పటికీ ఒక్క సిక్సర్ బాదలేకపోయాడు. కానీ టీమ్ఇండియాతో వన్డే సిరీసులో మాత్రం ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు. మూడు మ్యాచుల్లో 194.19 స్ట్రైక్రేట్, 83.50 సగటుతో 167 పరుగులు సాధించాడు. అందులో 12 బౌండరీలు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడు అతడే కావడం గమనార్హం. ఫించ్, స్మిత్, హార్దిక్, జడేజా తలో 6 సిక్సర్లతో అతడి తర్వాతే నిలిచారు.