ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జంబో టీమ్ కివీస్ కన్నా ఎంతో బలంగా ఉందని అన్నాడు భారత మాజీ వికెట్కీపర్, బ్యాట్స్మన్ పార్ధివ్ పటేల్. అన్ని విభాగాల్లో జట్టు సమతూకంగా ఉందని చెప్పాడు.
"జట్టు చాలా పటిష్ఠంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్తో పోలిస్తే టీమ్ఇండియా అన్ని విభాగాలను కవర్ చేసింది. ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, ఇషాంత్, షమీ వీరిలో ఎవరూ ఫిట్గా లేకపోయినా వారికి ప్రత్యామ్నాయంగా మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. రోహిత్శర్మ, శుభమన్ గిల్, కోహ్లీ, రహానె, పుజారా, పంత్తో బ్యాటింగ్ దళం బలంగా ఉంది. వీరంతా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించారు. ప్రతిఒక్కరు మంచి పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ కూడా తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందంటే జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ సిరీస్లో జడేజా స్థానంలో వచ్చి బాగా ఆడిన అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. ఇప్పుడు జడేజాతో పాటు అశ్విన్ కూడా వచ్చేశాడు. కాబట్టి జట్టు పటిష్ఠంగా ఉందనడంలో ఏ సందేహం లేదు" అని తెలిపాడు పార్థివ్.