తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 9:55 PM IST

ETV Bharat / sports

వాయుసేన విన్యాసాలు, పాప్ సింగర్ ప్రదర్శన, మోదీ హాజరు- ప్రపంచకప్ ఫైనల్ అదిరిపోవాల్సిందే!

World Cup Final 2023 : ప్రపంచకప్‌ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. నెల రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన క్రికెట్‌ మహా సంగ్రామం మరో రెండు రోజుల్లో ముగియనుంది. నవంబర్‌ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ వినోదానికి తెరపడనుంది. అయితే, ఫైనల్ మ్యాచ్ కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మ్యాచ్​ను వీక్షించేందుకు రానున్నారు.

world cup final 2023
world cup final 2023

World Cup Final 2023 :ఐసీసీ ప్రపంచకప్​ ముగింపు దశకు చేరింది. విశ్వవిజేత ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగే పోరు కోసం సర్వం సిద్ధమైంది. అయితే, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్​ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ముగింపు వేడుకలను అదే స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

స్టేడియం ఎదుట అభిమానుల సందడి

వాయు సేన విన్యాసాలు ఫైనల్​కు అదనపు ఆకర్షణగా నిలవన్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్‌ విమానాలు నరేంద్ర మోదీ స్టేడియంపై విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఫైనల్‌ ఆరంభమయ్యే పది నిమిషాల ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి. అందుకు సన్నాహకంగా సూర్యకిరణ్‌ విమానాలు శుక్రవారం రిహార్సల్స్‌ నిర్వహించాయి. 9 విమానాలు ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సూర్యకిరణ్‌ విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఈ ఐకానిక్‌ స్టేడియం పక్కనే నివాసం ఉండటం తమ అదృష్టమని వారన్నారు.

స్టేడియం వద్ద వైమానిక దళ విన్యాసాలు
స్టేడియం వద్ద వైమానిక దళ విన్యాసాలు

భారత ప్రధాని, ఆసీస్ డిప్యూటీ ప్రధాని హాజరు
ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నారు. ఆయనతో పాటు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్స్​ మార్లెస్​ సైతం రానున్నారు. ఈ మేరకు గుజరాత్ హోమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.

పాప్ సింగర్ ప్రదర్శన
మరోవైపు ముగింపు వేడుకలకు హాలీవుడ్‌, అల్బేనియన్‌ పాప్‌ సింగర్‌ దువా లిపాతో ఓ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ.. ముగింపు వేడుకల్లో లిపా ఈవెంట్‌ ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.

స్టేడియం ఎదుట అభిమానుల సందడి

అహ్మదాబాద్​లో జరిగే ఈ ఫైనల్​ మ్యాచ్​ కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది సర్దార్ వల్లభ్​భాయ్​ పటేల్​ అంతర్జాతీయ విమానాశ్రయం. క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ప్రయాణ ఏర్పాట్లు చేసింది. విమానాలను నిలిపేందుకు 15 స్టాండ్లను ఏర్పాటు చేయగా.. రాత్రి పార్కింగ్ కోసం ఎస్​ఓపీని సిద్ధం చేసింది. వీటితో పాటు సమీపంలోని ఇతర విమానాశ్రయాలను సంప్రదించి అక్కడి స్టాండ్లను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది.

ఫైనల్​ మ్యాచ్​ను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. బ్లాక్​లో టికెట్​ ధరకు పది రెట్లు చెల్లించి మరీ కొంటున్నారు. ఆన్​లైన్​తో పాటు స్టేడియంకు చేరుకుని ఆఫ్​లైన్​లో దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు. రూ.2 వేల టికెట్​ను రూ.20వేలకు.. రూ.4వేల టికెట్​ను రూ.40వేలకు విక్రయిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details