ఓవల్లో కథ మారుతోంది. మ్యాచ్ మలుపు తిరుగుతోంది. తొలి ఇన్నింగ్స్లో పేలవ బ్యాటింగ్తో వెనుకబడ్డ భారత్.. రెండో ఇన్నింగ్స్లో గొప్ప పోరాటంతో మ్యాచ్లో పైచేయి సాధించింది. రోహిత్ కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ శతకం సాధించడం వల్ల భారత్ విజయంపై కన్నేసే స్థితికొచ్చింది. రోహిత్కు తోడుగా పుజారా కూడా ఇంగ్లాండ్ పేస్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వేళ.. టీమ్ఇండియా లోటును పూడ్చేసి 171 పరుగుల ఆధిక్యం సంపాదించింది. చేతిలో ఇంకా ఏడు వికెట్లున్నాయి. కోహ్లీసేన మరో 60-70 పరుగులు సాధిస్తే.. ఇంగ్లాండ్కు సవాలు తప్పదు.
నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘనంగా పుంజుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (127; 256 బంతుల్లో 14×4, 1×6) అద్భుత శతకం సాధించడం వల్ల.. పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. తన కెరీర్కే ఉత్తమం అనదగ్గ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్తో పాటు పుజారా (61; 127 బంతుల్లో 9×4), రాహుల్ (46; 101 బంతుల్లో 6×4, 1×6) రాణించడంతో శనివారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. వెలుతురులేమి కారణంగా చాలా ముందే ఆట ముగిసింది. కోహ్లి (22 బ్యాటింగ్), జడేజా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక కష్టపడాల్సింది ఇంగ్లాండే కావొచ్చు.
అదరోహిట్
ఎంతో విలువైన ఆధిక్యాన్ని కోల్పోయినా.. భారత్ మ్యాచ్లో నిలిచింది అంటే, పట్టుబిగించే దిశగా సాగుతోందంటే ప్రధాన కారణం రోహిత్ శర్మ. నిస్సందేహంగా ఈ మ్యాచ్లో భారత్ హీరో అతడు. ఎంతో ఏకాగ్రత.. ఎంతో పట్టుదల, ఎంతో సంయమనంతో అతడు తన ఇన్నింగ్స్ను, భారత్ ఇన్నింగ్స్ను నిర్మించిన తీరు అద్భుతం. రెండు అత్యంత విలువైన భాగస్వామ్యాలతో రోహిత్ టీమ్ఇండియాకు ఊపిరిలూదాడు. చిరస్మరణీయ శతకంతో జట్టును నిలబెట్టాడు. 43/0...రెండో రోజు ఆట ఆఖరుకు భారత్ స్కోరిది. ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో భారత్కు పెద్ద ముప్పే పొంచి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం.. మరో ఓపెనర్ రాహుల్ (ఓవర్నైట్ 22)తో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించిన రోహిత్ (ఓవర్నైట్ 20) చాలా సాధికారతతో బ్యాటింగ్ చేశాడు. మబ్బుపట్టిన వాతావరణంలో పరిస్థితులకు తమను తాము గొప్పగా అన్వయించుకుంటూ రాహుల్, అతడు.. పేస్ త్రయం రాబిన్సన్, వోక్స్, అండర్సన్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. సిరీస్లో మొదటి నుంచి ఆడుతున్నట్లే రోహిత్ శరీరానికి చాలా దగ్గర ఆడాడు. ఆఫ్స్టంప్ ఆవల పడ్డ బంతులను చాలా వరకు వదిలేశాడు. అనవసర షాట్లకు పోకుండా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన అతడు.. గతి తప్పిన బంతులను శిక్షించడానికి మాత్రం వెరవలేదు. అండర్సన్ బౌలింగ్లో చక్కని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడిన రోహిత్.. అండర్సన్ ఓవర్ పిచ్ బంతిని కవర్స్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఒవర్టన్ బౌలింగ్లో పుల్ షాట్తో బౌండరీ సాధించాడు. లంచ్ వేళకు రాహుల్ను కోల్పోయినా.. భారత్ లోటును పూడ్చుకుని ఆధిక్యంలోకి వెళ్లింది. లంచ్ తర్వాత చక్కని బ్యాటింగ్ను కొనసాగించిన రోహిత్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం అవకాశం వచ్చినా బంతిని బౌండరీని దాటించాడు. స్పిన్నర్ అలీనీ వదల్లేదు. అతడి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు.. అండర్సన్ బంతిని మిడ్వికెట్లో బౌండరీ దాటించడం ద్వారా 94కు చేరుకున్నాడు. ఆ తర్వాత అతడు ఆడిన షాట్ అభిమానులకు ఇచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. అలీ బౌలింగ్లో లాంగాన్లో కళ్లు చెదిరే సిక్స్తో మూడంకెల స్కోరు (204 బంతుల్లో)ను అందుకున్నాడు రోహిత్. మరోవైపు పుజారా అతడికి చక్కని సహకారాన్నిచ్చాడు. టీ సమయానికి భారత్ 199/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. అదిరే బ్యాటింగ్తో రోహిత్ జట్టుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. మ్యాచ్పై ఆశలను కల్పించాడు.
పుజారా ఝుళిపించాడు
ఇబ్బందుల నుంచి గట్టెక్కుతూ భారత్ మెరుగైన స్థితిలో నిలవడంలో రాహుల్, పుజారాలదీ కీలక పాత్రే. ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచిన రోహిత్కు వాళ్లు అద్భుతమైన సహకారాన్నిచ్చారు. ఉదయం రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్.. తడబాటు లేకుండా ఆడాడు. వోక్స్ బౌలింగ్లో బంతిని కవర్స్లో బౌండరీ దాటించిన రాహుల్.. అతడి బౌలింగ్లో ఓ బంతిని సిక్స్కు హుక్ చేశాడు. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో అతడు అండర్సన్ బౌలింగ్లో బెయిర్స్టోకు చిక్కాడు. అప్పటికి స్కోరు 83. అయితే పుజారా ఏమీ తక్కువ తినలేదు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. డిఫెన్సివ్ ఆటను పక్కనపెడుతూ.. కొత్త పంథాను కొనసాగించాడు. వేగంగానే బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డు ముందుకు సాగడంలో తన వంతు పాత్ర పోషించాడు. స్క్వేర్ కట్, లేట్ కట్లతో అలరించాడు. పుజారా ఓ ర్యాంప్ షాట్ కూడా ఆడాడంటే.. అతడి ఆట ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. వోక్స్ బౌలింగ్లో అతడు ఆ షాట్తో ఫోర్ కొట్టినప్పుడు మైదానంలో చాలా మంది ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. ఓవర్టన్ బౌలింగ్లో ఫోర్తో పుజారా అర్ధశతకం (103 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.