తెలంగాణ

telangana

Ind vs Eng: గెలుపు కోసం భారత్​.. ప్రతీకారేచ్ఛతో ఇంగ్లాండ్​

By

Published : Aug 4, 2021, 6:01 AM IST

Updated : Aug 4, 2021, 6:56 AM IST

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ బుధవారం(ఆగస్టు 4 నుంచి) ప్రారంభం కానుంది. ఈ సిరీస్​ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​-2లో శుభారంభం చేయాలని కోహ్లీ సేన భావిస్తుండగా.. భారత్​లో ఓటమికి బదులు తీర్చుకోవాలని రూట్​ సేన ఎదురుచూస్తోంది. ట్రెంట్​బ్రిడ్జ్​ వేదికగా తొలి మ్యాచ్​ మధ్యాహ్నం 3.30కు ప్రారంభం కానుంది.

IND vs ENG
ఇండియా vs ఇంగ్లాండ్

ఇంగ్లాండ్​-ఇండియా మధ్య సుదీర్ఘ టెస్టు సిరీస్​కు రంగం సిద్ధమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత జరగబోతున్న తొలి సిరీస్​ ఇది. ఈ సిరీస్​లో గెలిచి టీమ్ఇండియా డబ్ల్యూటీసీ-2లో శుభారంభం చేస్తుందా? లేక ఇంగ్లాండ్​ గడ్డపై తేలిపోతుందా? అనేది చూడాల్సి ఉంది. ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ బుధవారం(ఆగస్టు 4) మధ్యాహ్నం 3.30కు ప్రారంభమవుతుంది.

జట్టు ఎంపిక ఎలా..

సౌథాంప్టన్​ వేదికగా కివీస్​తో ఇటీవల జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్ఇండియా ఘోర పరాభవం చవిచూసింది. మ్యాచ్​కు రెండ్రోజుల ముందే జట్టును ప్రకటించిన భారత కెప్టెన్​ కోహ్లీ.. తుదిజట్టులో ఇద్దరు స్పిన్నర్లకు అవకాశమిచ్చాడు. కానీ, అక్కడి వాతవరణం పేసర్లకు అనుకూలించింది. మ్యాచ్​కు ముందు మరోసారి తుదిజట్టులో మార్పులు చేసే వీలున్నప్పటికీ విరాట్ ఆ పని చేయలేదు. న్యూజిలాండ్ నలుగురు ఫాస్ట్​ బౌలర్లతో బరిలోకి దిగి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​తో సిరీస్​కు ఎలాంటి జట్టును బరిలోకి దించుతుందనేది భారత అభిమానులు ఎదురుచూసే అంశం.

రోహిత్​కు జోడీ అతడేనా?

రోహిత్​కు జతగా కేఎల్​ రాహుల్ భారత ఇన్నింగ్స్​ను ప్రారంభించే అవకాశం ఉంది. కౌంటీ సెలెక్ట్​ ఎలెవన్​తో జరిగిన తొలి వార్మప్​ మ్యాచ్​లో సెంచరీ చేయడం రాహుల్​కు కలిసొచ్చే అంశం. ఇటీవలి కాలంలో టెస్టుల్లో భారత్​కు ఓపెనర్​గా ఉన్న.. శుభ్​మన్​ గిల్​ గాయం కారణంగా సిరీస్​కు దూరమవ్వగా, ప్రాక్టీస్​లో గాయంతో మయాంక్ అగర్వాల్​ తొలి టెస్టుకు దూరమయ్యాడు.

ఇదీ చదవండి:బీసీసీఐ, పీసీబీ మధ్య 'కేపీఎల్' రగడ!

వీరు రాణిస్తే..

భారత ఇన్నింగ్స్​కు నయావాల్​లా పేరుగాంచిన పుజారా.. ఇటీవల కాలంలో పెద్దగా రాణించట్లేదు. ఒక మంచి ఇన్నింగ్స్​తో మళ్లీ ఫామ్​ను అందిపుచ్చుకోగల సత్తా అతని సొంతం. కానీ, అతని వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్​ కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్​లో తడబడుతున్నారు. వీరిద్దరిలో ఒక్కరైనా రాణించాల్సిన అవసరం ఉంది. వీరితో పాటు హనుమ విహారి మిడిలార్డర్​లో కీలకం కానున్నాడు.

ధనాధన్​ ఇన్నింగ్స్​లకు మారుపేరైన రిషభ్ పంత్​.. డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఉసూరుమనిపించాడు. రెండో ఇన్నింగ్స్​లో కాస్త పోరాడినా.. అప్పటికే మ్యాచ్​ చేజారింది. బోర్డర్​- గావస్కర్​ ట్రోఫీలో సత్తాచాటిన పంత్​.. అదే ఫామ్​ను కొనసాగించలేకపోయాడు. టెయిలెండర్ల సహకారంతో అతడు రాణిస్తే జట్టుకు మరిన్ని పరుగులు వస్తాయి. ఇంగ్లాండ్​ పరిస్థితుల దృష్ట్యా అశ్విన్​, జడేజా ఇద్దరికీ చోటు దక్కే అవకాశం లేదు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, షమి, ఇషాంత్​ శర్మను తుది జట్టులో ఆడించే వీలుంది. కివీస్​తో డబ్ల్యూటీసీ ఫైనల్​లో షమి, ఇషాంత్​ ఫర్వాలేదనిపించినప్పటికీ.. బుమ్రా పూర్తిగా తేలిపోయాడు.

లంక పర్యటనలో ఉన్న సమయంలో పృథ్వీ షా, సూర్యకుమార్​ యాదవ్​కు.. ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం ఆలస్యంగా పిలుపొచ్చింది. వారి సేవలను ఏమైనా వినియోగించుకుంటుందా అనేది వేచిచూడాలి.

ఇంగ్లాండ్​కు సానుకూలత..

సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లాండ్​కు అతిపెద్ద సానుకూలత. గత భారత పర్యటనలో ఓటమికి బదులుతీర్చుకోవాలని రూట్​ సేన భావిస్తోంది. దీంతో పాటు డబ్ల్యూటీసీ-2లో శుభారంభం చేయాలని యోచిస్తోంది. పేస్​కు అనుకూలించే ఇంగ్లిష్ పిచ్​లపై​ జేమ్స్​ అండర్సన్​, స్టువర్ట్​ బ్రాడ్​, ఒల్లీ రాబిన్సన్​, మార్క్​ వుడ్​, సామ్​ కరన్​ వంటి బౌలర్లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్​మెన్​కు సవాలనే చెప్పాలి. జోఫ్రా ఆర్చర్​ ఆడేది అనుమానంగా మారింది.

దీంతో పాటు బ్యాటింగ్​లో సుదీర్ఘ ఇన్నింగ్స్​లు ఆడగల కెప్టెన్ రూట్​తో పాటు బెయిర్​ స్టో, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్​ ఆ జట్టుకు అదనపు బలం. తనదైన రోజున రోరీ బర్న్స్​, జోస్​ బట్లర్​ భారీ ఇన్నింగ్స్​లు ఆడగల సత్తా ఉన్నవారే. బెన్​ స్టోక్స్​ వంటి ఆల్​రౌండర్ లేకపోవడం ఇంగ్లాండ్​కు అతిపెద్ద లోటు. ఇటీవలే.. అతడు క్రికెట్​కు కాస్త విరామం ప్రకటించాడు.

ఇదీ చదవండి:ఆ దేశ క్రికెటర్ల రాకతో మరింత సందడిగా ఐపీఎల్​

Last Updated : Aug 4, 2021, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details