సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో టాస్ ఒకసారి వేస్తారు. కాని ఆ రోజు మాత్రం రెండుసార్లు వేయాల్సి వచ్చింది. అదీ ప్రపంచకప్ మ్యాచ్లో జరగడం గమనార్హం.
వాంఖడే స్టేడియం 33 వేల మంది అభిమానులతో నిండిపోయి ఉంది. సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ నెగ్గి 28 ఏళ్ల తర్వాత కప్పు గెలవాలని భారత జట్టు ఎదురుచూస్తోంది. ఆ మ్యాచ్లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శ్రీలంక సారథి కుమార్ సంగక్కర టాస్ కోసం నిల్చున్నారు. ధోనీ కాయిన్ను పైకి విసిరిన తర్వాత రవిశాస్త్రి 'హెడ్' పడినట్లు చెప్పాడు. ధోనీ వెంటనే తాము మొదట బ్యాటింగ్ చేస్తామని తెలపగానే...ఆ విషయాన్ని నిర్ణయించుకునేందుకు రవిశాస్త్రి రిఫరీ వైపు చూశాడు. అయితే తానూ 'హెడ్' కోరుకున్నట్లు సంగక్కర చెప్పడం అయోమయ పరిస్థితికి దారితీసింది.