తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​లో తెలు'గోడు' వినలేదు..!

నాలుగేళ్లకోసారి జరిగే క్రికెట్​ సంగ్రామం.. అందుకోసం ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని జట్టును ప్రకటించింది బీసీసీఐ. తెలుగు క్రీడాకారులు సత్తా చాటుతున్నా.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో మాత్రం స్థానం లభించడం కష్టమవుతోంది. దీనిని నిజం చేస్తూ అప్పట్లో వీవీఎస్​ లక్ష్మణ్​ లాగే .. ఇప్పుడు అంబటి రాయుడికి మొండిచేయి చూపించింది.

By

Published : Apr 16, 2019, 9:46 PM IST

Updated : Apr 17, 2019, 12:08 AM IST

ప్రపంచకప్​లో తెలు'గోడు' వినలేదు..!

2019 ప్రపంచకప్​ జట్టు కూర్పులో.. అద్భుతంగా రాణిస్తున్న అంబటి రాయుడును తీసుకోకపోవడం వెనుక కారణమేంటి..? మాజీ క్రికెటర్లే నిర్ఘాంతపోతూ ప్రశ్నలు సంధిస్తున్నారు. భారత్​​ తరఫున వన్డేల్లో నాలుగో అత్యధిక బ్యాటింగ్​ సగటు అంబటిదే.

.

  1. విరాట్ కోహ్లీ (59.57), ధోని (50.37), రోహిత్ (47.39) తర్వాత బ్యాటింగ్​ సగటులోరాయుడు (47.05) నాలుగో స్థానంలో ఉన్నాడు.
  2. 2013లో భారత వన్డే జట్టులోకి ఎంపికైన రాయుడు ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు ఆడి 47.05 సగటుతో 1,694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది రాయుడు తడబడ్డాడు. 10 వన్డేలు ఆడి ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు.

ఎన్నో వదులుకున్నా...

ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు కోసం ఏడాది కాలం నుంచి హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. రంజీకి వీడ్కోలు పలికి వన్డే ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గతేడాది సెప్టెంబరులో ఆసియా కప్‌లో పునరాగమనం చేసి సత్తా చాటాడు. టీమిండియాలో ‘నాలుగో ’ స్థానానికి రాయుడు కచ్చితంగా సరిపోతాడు అనుకున్న అభిమానులకు బీసీసీఐ షాక్​ ఇచ్చింది. రాయుడును కాదని తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌వైపు బోర్డు మొగ్గు చూపింది.

కెరీర్​ ముగిసినట్లేనా...

2015 ప్రపంచకప్‌ భారత జట్టులో రాయుడు ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. 33 ఏళ్ల రాయుడు ఈసారి మంచి ఫామ్‌ కనబరిచి.. నాలుగో స్థానంలో కీలకంగా రాణించినా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2023 ప్రపంచకప్​నకూ ఇదే ఫామ్​ సహా వయసు పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. యువ ఆటగాళ్ల రాకతో అంబటి కెరీర్​ దాదాపు ముగిసినట్లేనని క్రికెట్​​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సెలక్టర్ల సమాధానం...

ఈ ఏడాదే అరంగేట్రం చేసిన విజయ్‌ శంకర్​కు ఆడిన 9 మ్యాచ్​ల్లో ఐదింట్లో బ్యాటింగ్​ అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌పై 45, ఆస్ట్రేలియాపై వరుసగా 46, 32, 26, 16 పరుగులు సాధించాడు. ధాటిగా బ్యాటింగ్‌ చేయగల నేర్పుతో పాటు బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాయుడుకు బదులుగా విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశామని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చారు. ఎమ్మెస్కే ఆంధ్రాకు చెందినవారు కావడం విశేషం.

Last Updated : Apr 17, 2019, 12:08 AM IST

ABOUT THE AUTHOR

...view details