తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2019, 5:16 AM IST

Updated : Jul 20, 2019, 6:59 AM IST

ETV Bharat / sports

'క్రికెట్​ కిట్​లు కాల్చేసి జాబ్​ వెతుక్కోవాలి'

జింబాబ్వే క్రికెట్ జట్టుపై ఐసీసీ గురువారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఆ దేశ క్రికెటర్లు​ సికిందర్​ రజా, బ్రెండన్​ టేలర్​,కేల్​ జార్విస్, సొలోమన్​ మెయిర్​ వంటి స్టార్లు ఆవేదన వ్యక్తం చేశారు . కొందరి కారణంగా ఆటనే నమ్ముకున్న ఎందరో క్రీడాకారుల భవిష్యత్తు​ నాశనమైందని ఆరోపించారు.

'క్రికెట్​ కిట్​లు కాల్చేసి జాబ్​ వెతుక్కోవాలి'

పసికూన జింబాబ్వే క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్(ఐసీసీ)గురువారంనిషేధం విధించింది. ఆ దేశ క్రికెట్​ బోర్డులో ప్రభుత్వ జోక్యం మితిమీరడం వల్ల ఈ సంచలన నిర్ణయం తీసుకుంది​ ఐసీసీ. తక్షణమే ఈ వేటు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై ఆ దేశ క్రికెటర్​ రజా తొలుత ట్విట్టర్​ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విధంగా ఆట నుంచి తప్పుకోవాలని ఏ క్రీడాకారుడు కోరుకోడని మనసులోని బాధ బయటపెట్టాడు.

" ఒక్క నిర్ణయం జట్టును విడదీసింది. ఎంతో మందిని నిరుద్యోగులుగా మార్చింది. ఎన్నో కుటుంబాల్లో బాధను నింపింది. ఎందరో క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసింది. ఈ విధంగా అంతర్జాతీయ క్రికెట్​కు ముగింపు పలకాల్సి వస్తుందని అనుకోలేదు ".
-- సికిందర్​ రజా, జింబాబ్వే క్రికెటర్​.

సికిందర్​ ట్వీట్​

అనంతరం జింబాబ్వేమాజీ కెప్టెన్​ బ్రెండన్​ టేలర్​, ఫాస్ట్​ బౌలర్​ కేల్​ జార్విస్​, ఆల్​రౌండర్​ సొలోమన్​ మెయిర్​ వంటి క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, మైదాన సిబ్బంది, యువ క్రికెటర్లు ఆటను వదిలి మరేదైనా పని చూసుకోవాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక నిరుపయోగమైన క్రికెట్​ కిట్లను తగులబెట్టడం తప్ప ఏం చేసే స్థితిలో లేరని వారి గోడు చెప్పుకున్నారు. ఐసీసీ షాకింగ్​ నిర్ణయం తర్వాత సొలోమన్​ అన్ని ఫార్మాట్లలో క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. 29 ఏళ్ల ఈ ఆటగాడు 47 వన్డేలు మాత్రమే ఆడి ఆట నుంచి తప్పుకున్నాడు.

2020 జనవరిలో భారత్​లో మ్యాచ్​లు ఆడేందుకు సిద్ధమవుతోంది జింబాబ్వే. మూడు టీ20లు ఆడేందుకు ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. 2002 ఫిబ్రవరిలో చివరిగా టీమిండియాతో తలపడింది పసికూన.

జింబాబ్వే జట్టుపై ఐసీసీ వేటు వేసిన తర్వాత రజా ట్వీట్​ చూసి భారత బౌలర్​ రవిచంద్రన్​ అశ్విన్​ ట్విట్టర్​ వేదికగా స్పందించాడు.

" జింబాబ్వే ఆటగాళ్లకు, అభిమానులకు ఐసీసీ నిర్ణయం గుండెలు బద్ధలయ్యే వార్తలాంటిది. రజా ట్వీట్​ చదివాక క్రికెటర్ల కెరీర్​ ఎలా వారి ప్రమేయం లేకుండా ముగిసిపోతుందో అర్థమైంది. వీలైనంత త్వరగా మళ్లీ ఆ జట్టు పూర్వ వైభవం పొందాలని మనసారా కోరుకుంటున్నా".
-- రవిచంద్రన్​ అశ్విన్​, భారత క్రికెటర్

ఏమైంది...?

ప్రస్తుత క్రికెట్‌ బోర్డులోని సభ్యులను అక్కడి ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ కమిటీ తొలగించడమే ఐసీసీ నిర్ణయానికి కారణం. ఆర్టికల్‌ 2.4(సి) (డి) నిబంధనను అతిక్రమించినందుకు శాశ్వత సభ్యదేశమైన జింబాబ్వేపై వేటు వేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్​ మండలి నుంచి వచ్చే నిధులు ఆగిపోవడమే కాకుండా ఏ టోర్నీల్లోనూ ఆ జట్టు ఆడేందుకు వీలు లేదు. అయితే మూడు నెలల్లో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు సభ్యులను తిరిగి నియమించాలని గడువు విధించింది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్‌ కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.

Last Updated : Jul 20, 2019, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details