ఒక త్రో మ్యాచ్ను మలుపుతిప్పుతుందని, కప్పు అందకుండా చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా! కానీ ఆదివారం ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ఫైనల్లో అదే జరిగింది. గెలిచే స్థితిలో ఉన్న న్యూజిలాండ్ రన్నరప్గా నిలిచింది. ఓటమి ఖాయమనుకున్న ఇంగ్లాండ్.. ఏకంగా కప్పు ఎగరేసుకుపోయింది.
అసలేం జరిగింది...?
ఇంగ్లాండ్ గెలవాలంటే 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న స్టోక్స్.. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. బంతిని త్రో చేశాడు కివీస్ క్రికెటర్ గప్తిల్. అది కీపర్ చేతిలోకి కాకుండా స్టోక్స్ బ్యాటును తాకి బౌండరీ చేరింది. 2+4 మొత్తం 6 పరుగులు ఇంగ్లాండ్ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. మ్యాచ్లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
మ్యాచ్ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్.. ఆ సమయంలో అలా జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్ కెప్టెన కేన్ విలియమ్సన్ "ఓడిపోయామనే విషయం నమ్మాలంటే కొంచెం కష్టమే. కానీ నమ్మక తప్పదు. మ్యాచ్లో గెలిచే దశలో అలా జరగాల్సింది కాదు. ఏదైతేనేం మా జట్టు అద్భుతంగా ఆడింది. ఫైనల్ మ్యాచ్లో మరో 10-20 పరుగులు అదనంగా చేయాల్సింది. మా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఒత్తిడికి గురిచేశారు. కానీ చివరకి ఓటమి పాలయ్యాం. ఇది నిజంగా ఓ గొప్ప మ్యాచ్" -కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
మ్యాచ్ గతినే మార్చిన ఆ సంఘటన.. తన ప్రమేయం లేకుండానే జరిగిందని, క్షమించాలని విలియమ్సన్ను కోరాడు ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్.
ఇది చదవండి: 44 ఏళ్లలో రాని కప్పు ఇంగ్లాండ్కు 4 ఏళ్లలో.. కారణాలివే!