తెలంగాణ

telangana

ETV Bharat / sports

నేడు న్యూజిలాండ్​తో పాక్ ఢీ- సెమీస్​పై కివీస్​ కన్ను

ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా దూసుకుపోతున్న న్యూజిలాండ్ నేడు పాకిస్థాన్​తో మ్యాచ్ తలపడనుంది. ఈ రెండింటి మధ్య బర్మింగ్​​హామ్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

By

Published : Jun 26, 2019, 6:02 AM IST

Updated : Jun 26, 2019, 8:30 AM IST

కివీస్ - పాకిస్థాన్

ఈ ప్రపంచకప్​లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది న్యూజిలాండ్. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మినహా మిగతా జట్లపై పరాభవం మూటగట్టుకుంది పాకిస్థాన్. నేడు ఈ రెండింటి మధ్య బర్మింగ్​​హామ్ వేదికగా మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది.

సెమీస్​పై కన్నేసిన కివీస్​

2019 మెగాటోర్నీలో నిలకడగా ఆడుతూ వరుస విజయాలు సొంతం చేసుకుంటోంది కివీస్ జట్టు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటిలో గెలవగా.. భారత్​తో జరగాల్సి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. విండీస్​తో జరిగిన మ్యాచ్​లో చివర్లో అద్భుతమే చేసి విజయం సాధించింది. 291 లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్​ను 286 పరగులకు ఆలౌట్ చేసింది.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్​లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. నాలుగు ఇన్నింగ్స్​ల్లో 373 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో రాస్ టేలర్​ కూడా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్​ల్లో 200 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది.

గప్తిల్, మున్రో, లాథమ్ లాంటి ఆటగాళ్లతో బ్యాటింగ్​లో బలంగా ఉంది కివీస్. బౌలింగ్ విషయానికొస్తే బౌల్ట్​, ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ నిలకడగా రాణిస్తున్నారు. ఫెర్గ్యూసన్ 5 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్​తో జరగబోయే మ్యాచ్​లో గెలిచి సెమీస్​ స్థానాన్ని ఖరారు చేసుకోవాలనుకుంటోంది కివీస్​.

నిలవాలంటే గెలవాల్సిందే..

ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే నెగ్గిన పాకిస్థాన్ ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. కివీస్​తో జరిగే ఈ మ్యాచ్​ పాక్​కు ఎంతో కీలకం కానుంది. ఇందులో గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే కష్టమే.

చిరకాల ప్రత్యర్థి భారత్​పై ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న పాకిస్థాన్ గత మ్యాచ్​లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. హారిస్ సోహైల్(89), బాబర్ అజామ్(69) విజృంభణతో 308 పరుగులు చేసింది. అనంతరం సఫారీలను 259 పరుగులకే కట్టడి చేసి 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బ్యాటింగ్​లో బాబర్ అజామ్, సోహైల్, హఫీజ్ నిలకడగా ఆడుతున్నారు. బౌలింగ్​లో మహ్మద్​ ఆమిర్ ఆకట్టుకుంటున్నాడు. 5 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన వారిలో మూడో స్థానంలో ఉన్నాడు. వహాబ్ రియాజ్, షాదాబ్ ఖాన్ మంచి ప్రదర్శన చేస్తున్నారు.

అయితే జట్టు సమష్టిగా రాణించడంలో విఫలమౌతోంది. ఈ ప్రపంచకప్​లో తాను ఆడిన తొలి మ్యాచ్​లోనే విండీస్ చేతిలో 105 పరుగులకే ఆలౌటైంది. తర్వాత ఆస్ట్రేలియాపైనా ఓటమి చవిచూసింది. భారత్​తో జరిగిన మ్యాచ్​లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ విభాగాల్లో విఫలమైంది.

ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఆరు సార్లు పాకిస్థాన్ గెలవగా.. కివీస్​ రెండు సార్లు మాత్రమే నెగ్గింది.

ఇది చదవండి: ఇంగ్లాండ్​కు కంగారూ దెబ్బ..

Last Updated : Jun 26, 2019, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details