తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేను చనిపోయినా.. భారత్ గెలవాలనుకున్నా'

2011 వన్డే ప్రపంచకప్​లో టీమిండియా గెలవడంలో ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ కీలకపాత్ర పోషించాడు. అదే సమయంలో కేన్సర్​తోనూ పోరాడాడు. అప్పటి పరిస్థితుల్ని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు యువీ. తాను చనిపోయినా భారత్​.. కప్ గెలవాలని అనుకున్నానని చెప్పాడు.

By

Published : Mar 20, 2020, 3:48 PM IST

యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్

2011లో వన్డే ప్రపంచకప్‌ టీమిండియా గెలవడానికి ప్రధాన కారణం యువరాజ్‌ సింగ్‌. ఆ టోర్నీలో అతడి ఆల్​రౌండర్​ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు బ్యాట్‌తో రాణిస్తూనే, బంతితోనూ మాయ చేశాడు. ముఖ్యంగా గ్రూప్‌ దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ ఎంతో కీలకం. ఆ రోజు అనారోగ్యంతో ఉన్నా, ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఓవైపు వికెట్లు పడుతుంటే.. మరోవైపు మైదానంలోనే వాంతులు చేసుకుంటూ నిలబడ్డాడు. శతకంతో కదం తొక్కి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.

నెమ్మదిగా ఉండే చెన్నై పిచ్‌పై పరుగులు తీయడం కష్టంగా మారింది. ఆదిలోనే గంభీర్‌, సచిన్‌ నిరాశపర్చారు. మూడో వికెట్‌కు విరాట్‌ కోహ్లీ(59)తో కలిసి యువీ 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే పలుసార్లు మైదానంలో వాంతులు చేసుకున్నాడు. కోహ్లీ ఔటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 268కు చేర్చాడు యువరాజ్‌. నాటి అనుభవాల్ని ఓ సందర్భంలో పంచుకున్నాడు.

యువరాజ్ సింగ్

"నాకెప్పుడూ ప్రపంచకప్‌లో శతకం బాదాలని ఉండేది. నేను ఆరోస్థానంలో ఆడటం వల్ల అదెప్పుడూ కుదరలేదు. 2011 ప్రపంచకప్‌లో సెహ్వాగ్‌ ఆడలేదు. దీంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. అప్పుడు దేవుడికి ఒకటే మొక్కుకున్నా. ఏం జరిగినా.. ఒకవేళ టోర్నీ తర్వాత నేను చనిపోయినా టీమిండియా ప్రపంచకప్‌ గెలవాలని కోరుకున్నా"

-యువరాజ్ సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్

తొలుత శతకం బాదిన యువీ, తర్వాత బౌలింగ్‌లోనూ రాణించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి, 18 పరుగులకే రెండు కీలక వికెట్లు తీశాడు. అనంతరం వెస్టిండీస్‌ 188 పరుగులకే కుప్పకూలడం వల్ల భారత్‌ మ్యాచ్‌ గెలిచింది. యువీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌ జరిగి నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకపై గెలుపొంది, రెండోసారి వన్డే ప్రపంచకప్​లో విశ్వవిజేతగా నిలిచింది. యువరాజ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details