తెలంగాణ

telangana

By

Published : Mar 8, 2020, 6:50 AM IST

ETV Bharat / sports

మహిళా క్రికెట్​కు కొత్త వన్నెలు తెచ్చిన సారథులు

హర్మన్​ప్రీత్ సేన తొలిసారిగా టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు ఆస్ట్రేలియాతో తుదిపోరులో తలపడనుంది. అయితే మహిళల జట్టు ఇంత గొప్పగా రాణించడం వెనుక ఎందరో మహిళా సారథుల కృషి ఉంది. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా వారిని గుర్తు చేసుకుందాం.

Women's Day Special: Indian Women Cricket Team Captains
మహిళా క్రికెట్​కు కొత్త వన్నెలు తెచ్చిన సారథులు

భారత మహిళా జట్టు ప్రపంచకప్​ను తొలిసారి ముద్దాడేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుత క్రికెట్​లో పురుషాధిక్యానికి చెక్ పెడుతూ మేమూ విశ్వవిజేతలుగా నిలవగలం అంటూ సగర్వంగా చాటేందుకు మరో అడుగు మాత్రమే ఉంది. గ్రూప్ స్టేజిలో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసిన హర్మన్​ప్రీత్ సేన ఫైనల్లో అదే జోరు చూపించాలని భావిస్తోంది. ఈ పోరు మహిళా దినోత్సవం రోజే జరగడం మరో విశేషం. అయితే ఇప్పుడు ఈ జట్టు ఇలా ఉందంటే అందుకు ఎందరో మహిళా సారథుల కృషి ఉంది. మరి తొలిసారి ఈ టైటిల్ గెలిచి ఈ ప్రత్యేకమైన రోజును వేడుకగా జరుపుకొంటారో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

1721లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడగా 1848లో 'ఇండియన్‌ క్రికెట్‌ క్లబ్‌' ఏర్పాటు చేశారు. అయితే టీమ్‌ఇండియా ఏర్పడింది మాత్రం 1911లో. 1932లో ఇంగ్లాండ్‌తో భారత్‌ అధికారిక తొలి టెస్టు ఆడింది. కొద్దికాలం తర్వాతే (1934).. భారత మహిళలు కూడా సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడేశారు. కానీ, పురుషుల క్రికెట్‌ మాదిరిగా మహిళల క్రికెట్‌కు ప్రోత్సాహం లభించలేదు. ఈ కారణంగా మహిళలకు క్రికెట్ అసోషియేషన్‌ ఏర్పడటానికి ఎన్నో ఏళ్లు పట్టింది. 1973లో 'భారత ఉమెన్స్‌ క్రికెట్‌ అసోషియేషన్' ఏర్పడింది. భారత మహిళల జట్టు 1976లో వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడింది. శాంతా రంగస్వామి సారథ్యంలో భారత్‌ తొలి విజయాన్ని అందుకుంది.

కానీ, భారత మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదరణ దక్కలేదు. మ్యాచ్‌లు, పర్యటనలు తక్కువగా ఉండేవి. అయినా జట్టు ప్రదర్శన గొప్పగానే ఉండేది. ఎట్టకేలకు 2006లో భారత ఉమెన్స్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ను బీసీసీఐ విలీనం చేసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. మ్యాచ్‌లు, పర్యటనలు పెరిగాయి. ఫలితంగా తమ సత్తా చాటడానికి వారికి అవకాశాలు ఎక్కువగా లభించాయి. అనంతరం ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఆటలో పరిణతి సాధిస్తూ బలమైన జట్టుగా అవతరించింది. దీనిలో డయానా ఎడుల్జి, శాంతా రంగస్వామి, అంజుమ్‌ చోప్రా, మమతా మబేన్‌, జులన్‌ గోస్వామి, మిథాలీ రాజ్‌ వంటి మేటి సారథుల పాత్ర వెలకట్టలేనిది.

శాంతా రంగస్వామి సారథ్యంలో

శాంతా రంగస్వామి భారత మహిళా క్రికెట్‌కు బలమైన పునాది వేసింది. భారత మహిళా జట్టు తొలి సారథిగా, జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డులు సృష్టించింది. అంతేకాక మహిళల జట్టుకు తొలి గెలుపు రుచిని అందించింది ఆమె. భారత్‌ తరఫున ఆమె 16 టెస్టులు, 19 వన్డేలు ఆడింది. టెస్టుల్లో 750 పరుగులు, 21 వికెట్లు, వన్డేల్లో 287 పరుగులు, 12 వికెట్లు తీసింది.

శాంతా రంగస్వామి

డయాన శకం

1975లో అరంగేట్రం చేసిన డయానా ఎడుల్జి మూడేళ్లకే వన్డే సారథిగా బాధ్యతలు అందుకుంది. 18 వన్డేలు, 4 టెస్టులకు నాయకత్వం వహించింది. వన్డేల్లో 7 విజయాలు సాధించగా, అన్ని టెస్టులు డ్రాగా ముగిశాయి. కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా కూడా డయానా జట్టుపై ప్రభావం చూపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. భారత్‌ తరఫున 20 టెస్టులు, 34 వన్డేలు ఆడిన ఆమె.. 615 పరుగులు, 109 వికెట్లు సాధించింది. మొత్తంగా భారత విజయవంతమైన సారథుల్లో ఒకరిగా నిలిచింది. అంతేకాక మహిళల క్రికెట్‌లో అత్యధిక బంతులు సంధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది.

డయానా ఎడుల్జి

అంజుమ్ నాయకత్వంలో

భారత మహిళల క్రికెట్‌లో అంజుమ్‌ చోప్రా చురుకైన పాత్ర పోషించింది. జట్టును ఆధునిక క్రికెట్‌కు అలవాటు పడేలా తీర్చిదిద్దింది. 2002లో సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆమె 28 వన్డేలకు, మూడు టెస్టులకు కెప్టెన్సీ చేసింది. వన్డేల్లో 10 విజయాలు, 17 ఓటములు, టెస్టుల్లో ఒక్క విజయం సాధించింది. ఎడమచేతి వాటం బ్యాటర్‌, కుడిచేతి వాటం బౌలర్‌ అయిన అంజుమ్‌ భారత్‌ తరఫున దాదాపు 17 సంవత్సరాలు ఆడటం విశేషం. 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టీ20లు ఆడిన ఆమె 3,645 పరుగులు చేసింది. వన్డేల్లో 21 వికెట్లు కూడా పడగొట్టింది.

అంజుమ్​ చోప్రా

దూకుడు మంత్రం

మిడిలార్డర్​లో ఆడిన మమతా మబేన్‌ దూకుడు ప్లేయర్‌గా పేరుతెచ్చుకుంది. పదేళ్ల పాటు భారత్‌ తరఫున క్రికెట్‌ ఆడిన ఆమె 4 టెస్టులు, 40 వన్డేలు ఆడింది. 484 పరుగులతో పాటు, 21 వికెట్లు సాధించింది. అంతేకాక ఒక్క టెస్టు, 19 వన్డేలకు కెప్టెన్సీ చేసింది. ఏకైక టెస్టును డ్రా చేసుకున్న ఆమె వన్డేల్లో ఏకంగా 14 విజయాలు సాధించింది. ఏడాది పాటే సారథిగా బాధ్యతలు నిర్వర్తించినా జట్టును దూకుడుతో నడిపించింది.

మమతా మబేన్​

జులన్ ఎక్స్​ప్రెస్

కెప్టెన్‌గా కంటే జులన్‌ గోస్వామి బౌలర్‌గా భారత్‌ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించింది. 2008 నుంచి 2011 మధ్యలో 25 వన్డేలకు కెప్టెన్సీ చేసిన ఆమె 12 విజయాలు, 13 పరాజయాలను చవిచూసింది. అయితే యువ మహిళా పేసర్లకు గోస్వామినే స్ఫూర్తి. 2002లో అరంగేట్రం చేసిన ఆమె ఇప్పటికీ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో మేటిగా నిలుస్తుంది. 2018లో టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమె 10 టెస్టులు, 182 వన్డేలు, 68 టీ20లు ఆడింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో 40, వన్డేల్లో 225, టీ20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

జులన్​ గోస్వామి

మిథాలీ రాకతో మరో మెట్టు

మిథాలీ రాజ్‌ వచ్చిన తర్వాత భారత మహిళల క్రికెట్‌లో పెను మార్పులు వచ్చాయి. ఈమె సారథ్యంలోనే భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది. అంతేకాక బలమైన జట్లను మట్టికరిపించింది. మిథాలీ 132 వన్డేలకు, ఆరు టెస్టులకు కెప్టెన్సీ చేసింది. టెస్టుల్లో మూడు విజయాలు సాధించగా ఒక్క ఓటమి చవిచూసింది. ఇక వన్డేల్లో 82 మ్యాచ్‌ల్లో గెలవగా, 47 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. వన్డే ప్రపంచకప్‌లో జట్టును రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన భారత కెప్టెన్‌గా ఘనత సాధించింది.

మిథాలీ రాజ్​

ప్లేయర్‌గానూ మిథాలీ ఎన్నో రికార్డులు నమోదుచేసింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 1999లో ఐర్లాండ్‌ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఆమె ఇప్పటికీ భారత్‌ తరఫున ఆడుతుండటం విశేషం. టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆమె వన్డే, టెస్టులకు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. టీమ్‌ఇండియా తరఫున 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో 663, వన్డేల్లో 6,888, టీ20ల్లో 2,364 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌ మంచి స్థితిలో ఉండటానికి ఎంతో మంది క్రికెట్‌ తారలు కారణమైనా.. అందరిలోనూ మిథాలీ పాత్ర ప్రత్యేకం.

ఇదీ చూడండి.. 104 ఏళ్ల బామ్మకు నారీశక్తి పురస్కారం

ABOUT THE AUTHOR

...view details