చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ తీసుకున్న నిర్ణయాలపై మాజీలతో పాటు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధిక్యం 400 పరుగులు దాటిన తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తుందని భావించారంతా. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొనసాగించింది. అయితే దూకుడుగా ఆడి మరిన్ని పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనే ఆలోచనతో బ్యాటింగ్ చేస్తుందని అనుకున్నారంతా.
కానీ ఇంగ్లాండ్ దానికి విరుద్ధంగా నిదానంగా ఆడుతూ ఓవర్లను వృథా చేసింది. అసలు డిక్లేర్ చేయాలనే ఆలోచనే లేదన్నట్లుగా ఆడింది. మొత్తంగా అశ్విన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ 178 పరుగులకు కుప్పకూలడం వల్ల.. భారత్కు 420 పరుగుల లక్ష్యమని తేలింది. అయితే ఇంగ్లాండ్ డిక్లేర్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని క్రికెట్ ప్రపంచం చర్చిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం..
2008 ఓటమి సీన్ రిపీట్ అవ్వొద్దనా?
2008లో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఇంగ్లాండ్కు పీడకలలా మారింది. 387 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా అద్భుత పోరాటంతో టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట ఆఖరి రోజు సెహ్వాగ్ (83) విధ్వంసకర బ్యాటింగ్ చేయగా సచిన్ (103*), యువరాజ్ (85*) సమయోచిత ఇన్నింగ్స్ ఆడారు. ఆ విజయంతో భారత్ రికార్డు సృష్టించింది. స్వదేశంలో అత్యధిక ఛేదనగా నిలిచింది. అంతకుముందు 1987లో వెస్టిండీస్ సాధించిన 276 పరుగులే అత్యధికం. అయితే మరోసారి అలాంటి పరాభవం ఎదురుకాకూడదని ఇంగ్లాండ్ భావించి ప్రస్తుత టెస్టులో డిక్లేర్ ఇవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు.