తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2021, 9:18 AM IST

ETV Bharat / sports

'అమ్మో.. టీమ్ఇండియాతో ఆచితూచి ఆడాల్సిందే!'

బోర్డర్​-గావస్కర్​ టోర్నీ వల్ల టెస్టు క్రికెట్​కు గొప్ప ప్రచారం లభించిందని ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్​ అన్నాడు. ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన టీమ్ఇండియా జట్టును.. ఓడించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.

We have to be at our absolute best against India, says Root
'అమ్మో.. టీమ్ఇండియాతో ఆచితూచి ఆడాల్సిందే!'

ఆస్ట్రేలియాపై పుంజుకొని టీమ్‌ఇండియా సిరీస్‌ కైవసం చేసుకోవడం వల్ల టెస్టు క్రికెట్‌కు గొప్ప ప్రచారం లభించిందని ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అన్నాడు. స్వదేశంలో భారత్‌తో తలపడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు రూట్‌ మీడియాతో ఈ విధంగా మాట్లాడాడు.

"ఆసీస్‌-భారత్‌ సిరీసును మొదటి నుంచి చూస్తే అద్భుతమైన క్రికెట్‌తో దానికి ముగింపునిచ్చారు. టీమ్‌ఇండియా గొప్పగా పోరాడింది. అసమాన సాహసాన్ని ప్రదర్శించింది. ఘోర ఓటమి నుంచి పుంజుకొంది. జట్టులోకి వచ్చిన ప్రతి ఒక్కరు రాణించారు. టెస్టు క్రికెట్‌ను ఆదరిస్తున్న అభిమానుల ప్రకారం ఆటకు ఈ సిరీస్‌ గొప్ప ప్రచారం తీసుకొచ్చింది. భారత్‌ ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌ను మరింత రసవత్తరంగా మార్చేసింది."

- జో రూట్​, ఇంగ్లాండ్​ కెప్టెన్​

"మాతో సిరీసుకు టీమ్‌ఇండియా గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉంటుందని అనుకుంటున్నా. వారిది మంచి జట్టు. సొంతగడ్డపై విజయాలు ఎలా సాధించాలో బాగా తెలుసు. కోహ్లీసేనతో పోరాడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను కనబరచాలి. ఏదేమైనా భారత్‌-ఇంగ్లాండ్‌ సిరీస్‌ అద్భుతంగా ఉండనుంది. గెలవాలనే ఉద్దేశంతో మేం వస్తున్నాం. ఇందుకోసం మేమెంతో శ్రమించాలని తెలుసు" అని రూట్‌ పేర్కొన్నాడు.

భారత్‌లో సిరీసుకు బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ రావడం జట్టులో జోష్‌ నింపుతుందని జో రూట్​ అన్నాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన మొదలవుతుంది. రెండు జట్లు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి.

ఇదీ చూడండి:ఐపీఎల్: చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ఉతప్ప

ABOUT THE AUTHOR

...view details