తెలంగాణ

telangana

ఆ ఓటమికి ప్రతీకారంగానే భారత్​పై సంబరాలు: బంగ్లా సారథి

By

Published : Feb 10, 2020, 2:06 PM IST

Updated : Feb 29, 2020, 8:56 PM IST

అండర్​-19 ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​పై విజయానంతరం బంగ్లా ఆటగాళ్ల తీరు విమర్శలకు దారితీస్తోంది. సీనియర్ల తరహాలోనే వివాదాస్పద సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా టీమిండియాపై దుర్భాషలాడుతూ కవ్వించారు. ఈ విషయంపై ఇరు జట్ల సారథులు ప్రియమ్​గార్గ్​, అక్బర్​ స్పందించారు.

Under-19 World Cup clash: 'Dirty' celebrations by bangla says Priyam Garg, Akbar Ali 'sorry' for reaction of his boys
'ఆసియా కప్​లో ఓటమికి ప్రతీకారంగానే అలా చేశారేమో'

దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా ఆదివారం బంగ్లా-భారత్​ మధ్య అండర్​-19 ప్రపంచకప్​ ఫైనల్​ జరిగింది. ఈ మ్యాచ్​లో యువ టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే తొలిసారి వరల్డ్​కప్​ అందుకున్న బంగ్లా జట్టు... మనసులు మాత్రం గెలవలేకపోయింది. వివాదస్పద సంబరాలు చేసుకొని భారత ఆటగాళ్లపై మాటల యుద్ధానికి దిగింది. ఫలితంగా ఇరుజట్లు కొట్టుకునేంతకు దారి తీసింది పరిస్థితి.

తాజాగా బంగ్లాదేశ్​ జట్టు తీరుపై భారత సారథి ప్రియమ్​గార్గ్​ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయానంతరం బంగ్లా ఆటగాళ్లు శ్రుతి మించి ప్రవర్తించారని, చెత్తగా సంబరాలు చేసుకొన్నారని భారత సారథి అన్నాడు.

బంగ్లా సారథి అక్బర్​, భారత జట్టు కెప్టెన్​ ప్రియమ్​గార్గ్​

" మ్యాచ్​ అయిపోయాక మేం సాధారణంగానే ఉన్నాం. ఆటలో గెలుపు, ఓటములు సహజం. ఇవన్నీ క్రీడలో భాగమని భావించాం. అయితే ప్రత్యర్థుల గెలుపు సంబరాలు చెత్తగా ఉన్నాయి. అలా జరగకూడదు"

-- ప్రియమ్​గార్గ్​, భారత కెప్టెన్​

తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా ఓపెనర్లపై.. ఆరంభం నుంచే మాటల దాడికి దిగారు బంగ్లా ఆటగాళ్లు. భారత బ్యాట్స్‌మెన్‌ను అదే పనిగా కవ్వించారు. పేసర్‌ షొరిఫుల్‌ ఇస్లామ్‌ ప్రతి బంతికీ బ్యాట్స్‌మెన్‌ను తిడుతూ కనిపించాడు. విజయానంతరం బంగ్లా ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను చూస్తూ వెకిలిగా సంజ్ఞలు చేశారు. అంతేకాకుండా భారత కుర్రాళ్ల దగ్గరికి వచ్చి హేళన చేశారు. ఫలితంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకొంది.

కొందరు ఆటగాళ్లు దాదాపు కొట్టుకోబోయారు. వెంటనే అంపైర్లు, సహాయక సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఆ ఓటమికి ప్రతీకారంగానే..!

బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల చేష్టలకు ఆ​ జట్టు సారథి అక్బర్‌ క్షమాపణలు తెలిపాడు. ఆసియా కప్​లో ఓటమికి ప్రతీకారం తీర్చుకొన్నట్లు భావించే మా జట్టు ఆటగాళ్లు కాస్త దూకుడు ప్రదర్శించి ఉంటారని అభిప్రాయపడ్డాడు.

"ఇలా జరగడం దురదృష్టకరం. మా బౌలర్లు కొందరు ఎక్కువగా ఉద్వేగానికి గురయ్యారు. అత్యుత్సాహం చూపారు. అయితే వారు గతంలో జరిగిన ఆసియాకప్‌కు ప్రతీకారంగా దీనిని భావించారు. అందులో మేం ఫైనల్‌లో ఓటమిని చవిచూశాం. ఇప్పుడు విజయం సాధించే సరికి అలా చేశారు. ఏదీ ఏమైనా మర్యాదస్తుల ఆట అయిన క్రికెట్‌లో ప్రత్యర్థులకు గౌరవం ఇవ్వాలి. ఇలా జరగకూడదు. మా జట్టు తరఫున క్షమాపణలు చెబుతున్నా".

-- అక్బర్​, బంగ్లా సారథి

బంగ్లా జట్టు తీరుపై టీమిండియా యాజమాన్యం స్పందించింది. ఇందులో భారత కుర్రాళ్లు తప్పు ఏమాత్రం లేదని తెలిపింది. ఆదివారం జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌పై బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Last Updated : Feb 29, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details