చెన్నై సూపర్కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్కు ఈసారి విభిన్నంగా సన్నద్ధమయ్యాడని సహచరుడు సురేశ్ రైనా తెలిపాడు. మహీ, రాయుడు, మురళీ, తాను ఒక బృందంగా ఏర్పడి సాధన చేశామని చెప్పాడు. లాక్డౌన్కు ముందు చెన్నైలో నిర్వహించిన శిబిరానికి వీరంతా హాజరయ్యారు.
"ధోనీ సాధన ఈసారి భిన్నంగా సాగింది. రాయుడు, మహీ భాయ్, మురళీ, నేనూ కలిసి ఒక బృందంగా సిద్ధమయ్యాం. చెన్నైలో ఉన్నప్పుడు ధోనీ 2-4 గంటలు సాధన చేసేవాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం అలసిపోలేదు. మహీ ఉదయం జిమ్లో కసరత్తులు చేసేవాడు. సాయంత్రం 3 గంటలు బ్యాటింగ్ సాధన చేసేవాడు. వరుసగా జిమ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ సాధన చేస్తే మరుసటి రోజు శరీరమంతా బిగుతుగా అవుతుంది. అలాంటప్పుడు మన శరీరం కొద్దిగా నెమ్మదిస్తుంది. అప్పుడు మరింత కష్టపడాలి. మూడు గంటల శిక్షణ ఉంటే ఐదు గంటలు సాధన చేయాలి. అప్పుడే అలసట లేకుండా నాలుగు గంటలు మ్యాచ్ ఆడగలం."