ఐపీఎల్ను కరోనా కమ్మేస్తోంది.. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లతో పాటు పది మంది మైదాన సిబ్బందికి వచ్చిన ఈ మహమ్మారి.. తాజాగా బయో బబుల్లో ఉన్న 14 మంది ప్రసార సిబ్బందికి కూడా సోకింది. ముంబయిలోని ఫోర్ సీజన్స్ హోటల్లో విడిది చేసిన స్టార్ స్పోర్ట్స్కు చెందిన సభ్యులకు పాజిటివ్గా తేలినట్లు తెలిసింది. వీరిలో కెమెరామెన్, డైరెక్టర్లు ఈవీఎస్ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లు ఉన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఒకటికి మించి బయో బబుల్లను ఏర్పాటు చేసింది. కానీ ఈ మహమ్మారి మాత్రం చాపకింద నీరులా చొరబడుతోంది. అయితే కరోనా వ్యాప్తిపై అధికారిక ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్తో పాటు ఇతర వ్యాపార భాగస్వాములు కూడా బీసీసీఐ ముందు తమ ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇదీ చదవండి:నిజజీవిత 'జెర్సీ'.. సీఎస్కేలో తెలుగు కుర్రాడి కథ
కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నా ముంబయిని ఐపీఎల్ వేదికగానే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ పరిస్థితి తీవ్రత చూస్తే మ్యాచ్లు సజావుగా సాగుతాయో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. క్రికెటర్లు అక్షర్ పటేల్, దేవ్దత్ పడిక్కల్కు ఇప్పటికే కరోనా ఉన్నట్లు తేలింది. మున్ముందు ఇంకెంత మంది బయటపడతారో అనే ఆందోళనలు ఉన్నాయి. అయితే బయో బుడగ సురక్షితమని.. షెడ్యూల్ ప్రకారమే ముంబయిలో మ్యాచ్లు జరుగుతాయని బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు.