తెలంగాణ

telangana

ETV Bharat / sports

8 ఏళ్లకు భారత్​ క్లీన్​స్వీప్​.. కోహ్లీ సారథ్యంలో తొలిసారి - virat Test series whitewash by newzeland

కివీస్‌ పర్యటన ఆరంభంలో వరుసగా ఐదు టీ20లు గెలిచిన భారత్‌.. మళ్లీ గెలుపు రుచి చూడదని ఎవరూ ఊహించలేదేమో! కనీస పోరాటం లేకుండా రెండు టెస్టుల సిరీస్​ను కివీస్​కు అప్పజెప్పింది టీమిండియా. ఫలితంగా 8 ఏళ్ల తర్వాత భారత జట్టు ఖాతాలో ఓ చెత్త గణాంకం చేరింది.

Test series whitewash of TeamIndia
8 ఏళ్లకు భారత్​ క్లీన్​స్వీప్​.. కోహ్లీ సారథ్యంలో తొలిసారి

By

Published : Mar 3, 2020, 9:08 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు.. న్యూజిలాండ్‌ అడ్డుకట్ట వేసింది. కివీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన 0-2తో ఓటమిపాలైంది. ఫలితంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ స్టార్​ క్రికెటర్​ సారథ్యంలో తొలిసారి టెస్టు సిరీస్‌ వైట్‌వాష్ అయింది టీమిండియా. అలాగే భారత్‌.. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్‌ను చవిచూసింది. 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలో చివరిసారిగా భారత్‌ 0-4 తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత జట్టు టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌ అయింది.

టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, కివీస్​ సారథి కేన్​ విలియమ్సన్​

టీమిండియా 2018 నుంచి విదేశాల్లో(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌) ఆడిన నాలుగు సిరీస్‌ల్లో మూడు కోల్పోయింది. 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 2-1తో చారిత్రక విజయం మినహాయిస్తే.. 2018లో దక్షిణాఫ్రికా చేతిలో 2-1, ఇంగ్లాండ్‌ చేతిలో 4-1 తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు విదేశాల్లో రాణించలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో.. పది మ్యాచ్‌ల్లో ఇప్పటికే 360 పాయింట్లు సాధించిన కోహ్లీసేన అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే.. ఇందులో ఎక్కువగా విజయాలు సాధించింది స్వదేశంలోనే కావడం గమనార్హం. తాజాగా కివీస్​పై వైట్​వాష్​కు గురైంది. అయితే.. ఆసీస్​ సహా రానున్న ఇతర విదేశీ సిరీస్​లూ భారత్​కు సవాల్​ విసరనున్నాయి. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టీమిండియాను ఓడించిన కివీస్‌ మూడో స్థానానికి ఎగబాకింది.

టెస్టు సిరీస్​ గెలిచాక ట్రోఫీతో కివీస్​ జట్టు

ABOUT THE AUTHOR

...view details