చెన్నై సూపర్కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ తనకు తండ్రిలాంటి వారని అన్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. తననెప్పుడూ ఆయన చిన్న కొడుకులా చూసుకొనేవారని పేర్కొన్నాడు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే స్వదేశానికి తిరిగొచ్చానని స్పష్టం చేశాడు. ఈ సీజన్లోనే మళ్లీ పసుపు రంగు జెర్సీ ధరించినా ఆశ్చర్యం లేదన్నాడు. ఐపీఎల్ను వదిలిరావడానికి కారణాలేంటో 'క్రిక్ బజ్'కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో రైనా వివరించాడు.
వివాదం లేదు..
"కుటుంబం కోసమే తిరిగి రావాలని నిర్ణయించుకున్నా. వెనువెంటనే నేను దగ్గరుండి చూసకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సీఎస్కే కూడా నా కుటుంబమే. మహీ భాయ్ నాకెంతో ముఖ్యమైన వ్యక్తి. ఈ నిర్ణయం చాలా కఠినమైందే. సీఎస్కే, నాకూ మధ్య ఎలాంటి వివాదం లేదు. గట్టి కారణం లేకుండా ఎవరూ రూ.12.5 కోట్లు వదులుకోరు. అంతర్జాతీయ క్రికెట్కు నేను వీడ్కోలు పలికి ఉండొచ్చు. కానీ నాకింకా వయసుంది. మరో నాలుగైదేళ్లు చెన్నైకి ఆడగలను"
- సురేశ్ రైనా, చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు
తండ్రి మందలించడా..?
"శ్రీనివాసన్ నాకు తండ్రిలాంటి వారు. నాకెప్పుడూ అండగానే ఉన్నారు. ఆయన నా హృదయానికి ఎంతో దగ్గర. నన్ను చిన్న కొడుకులా చూసుకుంటారు. ఆయన వ్యాఖ్యలన్ని మరో కోణంలోనే చూశారని కచ్చితంగా నాకు తెలుసు. తండ్రి.. తన కొడుకును మందలించకుండా ఉంటారా? మొదట మీడియాతో మాట్లాడినప్పుడు ఆయనకు అసలు కారణం తెలియదు. తెలిసిన వెంటనే నాకు సందేశం పంపించారు. నేనూ మాట్లాడాను. ఈ వివాదానికి ముగింపు పలకాలని మేమంతా కోరుకుంటున్నాం"అని రైనా పేర్కొన్నాడు.
మళ్లీ శిబిరంలోకి!
ప్రస్తుతం భారత్లో తాను క్వారంటైన్లో ఉన్నప్పటికీ సాధన చేస్తున్నానని అన్నాడు రైనా. మళ్లీ దుబాయ్లో తనను చూసిన ఆశ్చర్యం లేదని అంటున్నాడు. ఐపీఎల్-2020ని సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ, జట్టు యాజమాన్యాలు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపాడు. క్వారంటైన్లో ఆటగాళ్లు గదుల్లోంచి బయటకు రాలేదని.. రెండు రోజులకోసారి పరీక్షలు చేయించుకున్నామని వివరించాడు. ఇలాంటి వాతావరణంలో మునుప్పెన్నడూ మనం ఉండలేదన్నాడు.
కుటుంబం కోసం ఆందోళన
బయో బుడగలో ఉన్నప్పుడు తన కుటుంబం గురించి ఆందోళన చెందానని రైనా చెప్పాడు. అప్పటికే 20 రోజులు పిల్లలకు దూరమయ్యానని, వారికేమైనా అయితే పరిస్థితి ఏంటని బెంగపడినట్లు స్పష్టం చేశాడు. తన మేనత్త కుటుంబానికి జరిగింది ఘోరమని పేర్కొన్నాడు రైనా. ఈ సమయంలో తన కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చెన్నై ఆటగాళ్లు, సిబ్బందికి వైరస్ సోకిందన్నాడు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు.