ఇప్పటికే కరోనా దెబ్బతో కంటికి కునుకు లేకుండా గడుపుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా మరో ఎదురుదెబ్బ కొట్టాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతున్నట్లు శనివారం ఆ జట్టు సీఈవో విశ్వనాథన్ ట్వీట్ చేశాడు. తాజాగా రైనా ఈ సీజన్ నుంచి తప్పుకోవడంపై ఆ జట్టు ఆల్రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు.
"వ్యక్తిగత కారణాల రిత్యా రైనా భారత్కు తిరిగి వెళ్లాడనే చేదు వార్తతో ఈరోజు నిద్రలేచా. ఇప్పుడతడు బాగానే ఉన్నాడని అనుకుంటున్నా. సురేశ్.. సీఎస్కే నిన్ను కచ్చితంగా మిస్ అవుతుంది. ఆది నుంచి ఈ జట్టుతోనే కలిసి ఉన్నావు. ఎల్లప్పుడూ నువ్వు ఈ జట్టుకు గుండెచప్పుడివి. ఈ టోర్నీకే స్టార్ ఆటగాడివి. నీకోసం ఏదైనా చేస్తాం. నీవు గర్వపడేలా ఈ సీజన్లో ఆడతాం."