తెలంగాణ

telangana

'అతడి స్థానంలో పంత్‌కు చోటు ఇవ్వండి'

By

Published : Jan 23, 2021, 10:54 PM IST

ఆస్ట్రేలియాపై పరిమిత ఓవర్లలో అదరగొట్టిన పంత్​ను ఆ ఫార్మాట్లో ఇకపై జట్టులో కొనసాగించాలని అన్నాడు ఆసీస్​ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్. శ్రేయస్ అయ్యర్ లేదా సంజు శాంసన్‌కు బదులుగా అతడిని ఆడించాలని పేర్కొన్నాడు. కోహ్లీ కెప్టెన్సీపైనా హాగ్​ కీలక వ్యాఖ్యలు చేశాడు.

'Rishabh Pant should replace Shreyas Iyer or Sanju Samson in India's ODI, T20I squads'
'అతడి స్థానంలో పంత్‌కు చోటు ఇవ్వండి'

సుదీర్ఘ ఫార్మాట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న టీమ్​ఇండియా వికెట్‌కీపర్‌ రిషబ్ పంత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులోకి కూడా తీసుకురావాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో పంత్ స్థానం కోల్పోగా, కేఎల్ రాహుల్ వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

రిషబ్ పంత్, సంజు శాంసన్

"పంత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోనూ తీసుకురావాలి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ రెండు వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడాడు. కంగారూల గడ్డపై ఆడిన ఇన్నింగ్స్‌లు అంటే ప్రత్యేకంగా భావించాలి. పంత్‌కు బౌలింగ్ చేయాలంటే కాస్త శ్రమించాల్సి ఉంటుంది. అతడు వైవిధ్యమైన షాట్లు ఆడుతుంటాడు. అయితే శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో అతడికి చోటు ఇవ్వాలి. లేదా సంజు శాంసన్‌కు బదులుగా ఆడించాలి. కాగా, ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకువచ్చేలా టీమ్​ఇండియా ప్రయత్నించాలి. అప్పుడు బౌలింగ్, బ్యాటింగ్‌లో మరింత బలం పెరుగుతుంది" అని హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో భారత్‌ ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

విరాట్ కోహ్లీ, అజింక్య రహానె కెప్టెన్సీ గురించి బ్రాడ్ హాగ్‌ మాట్లాడాడు. "కెప్టెన్‌గా రహానె ఆస్ట్రేలియాతో ఆఖరి మూడు టెస్టుల్లో సత్తాచాటాడు. అతడు ఎలాంటి ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా జట్టును నడిపించాడు. జింక్స్‌ గొప్ప నాయకుడు. అయితే టీమిండియాకు కెప్టెన్‌గా కోహ్లీనే ఉండాలి. రహానె వైస్‌ కెప్టెన్‌గానే ఉండాలి. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తాడు. అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తే టీమ్‌ఇండియా సంస్కృతిని నాశనం చేసినట్టు అవుతుంది. అది కోహ్లీ బ్యాటింగ్‌ పైనా ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఇలా జరగాలని అతడు కోరుకోకపోవచ్చు. కానీ, అలా జరిగే అవకాశాల్ని కొట్టిపారేయలేం" అని తెలిపాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానె ఆసీస్‌తో జరిగిన ఆఖరి మూడు టెస్టులకు కెప్టెన్సీ వహించాడు.

ఇదీ చూడండి:'పంత్​ ఆడుతుంటే ఇరుజట్లకు దడే'

ABOUT THE AUTHOR

...view details