తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ-శాస్త్రి జోడీ అందుకే హిట్టయింది' - కోహ్లీ రవిశాస్త్రి నెహ్రా

ఆలోచన పరంగా కెప్టెన్ కోహ్లీ-కోచ్ రవిశాస్త్రి ఒకేలా ఉంటారని, అందుకే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారని మాజీ బౌలర్ నెహ్రా అభిప్రాయపడ్డాడు.

'కోహ్లీ-శాస్త్రి జోడీ అందుకే హిట్టయింది'
కోహ్లీ- రవిశాస్త్రి

By

Published : Aug 4, 2020, 8:28 AM IST

భారత క్రికెట్‌జట్టు సారథి కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి మూర్తిమత్వం ఒకేలా ఉంటుందని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఆశిష్‌‌ నెహ్రా అన్నాడు. అందుకే ఈ ద్వయం విజయాల శాతం ఎక్కువని చెప్పాడు. విరాట్‌కు ఏం ఇవ్వాలో శాస్త్రికి తెలుసని, కోచ్‌ ఏం ఆశిస్తాడో కెప్టెన్‌కు తెలుసని పేర్కొన్నాడు. స్టార్‌స్పోర్ట్స్‌ 'క్రికెట్‌ కనెక్టెడ్‌' కార్యక్రమంలో నెహ్రా ఈ విధంగా మాట్లాడారు.

కోహ్లీ, రవిశాస్త్రి ఎంత చనువుగా, సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కలయికలో టీమ్‌ఇండియా ఎన్నో ఘన విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్‌ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌లోనూ సత్తా చాటింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో నువ్వా నేనా అన్నట్టు పోటీపడింది. పేస్‌ విభాగం దుర్భేద్యంగా మారింది. టెస్టుల్లో అగ్రస్థానాన్ని కొనసాగించింది. అయితే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లో సెమీస్‌లో ఓటమి, నాలుగో స్థానంపై స్పష్టత లేకపోవడం, మిడిలార్డర్‌పై సందేహాలు ఈ ద్వయాన్ని కలవరపరుస్తాయి.

కెప్టెన్​ కోహ్లీతో కోచ్ రవిశాస్త్రి

'విరాట్‌ కోహ్లీకి అవసరమైన స్వేచ్ఛను రవిశాస్త్రి ఇస్తారు. శాస్త్రి ఎలాంటి వ్యక్తో, ఆయన్నుంచి ఏం రాబట్టుకోవాలో కోహ్లీకి తెలుసు. ఎందుకంటే శాస్త్రి గొప్పగా ప్రేరణనిస్తారు. అదే ఆయన బలం. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతారు. ఒకవేళ మీరు ఊబిలో మెడ వరకు ఇరుక్కుపోయారనుకోండి! చేతుల్ని రెండుసార్లు బలంగా కిందకు నొక్కి బయటకు వచ్చేయమంటారు. కోహ్లీ కూడా జట్టును ముందుండి నడిపిస్తాడు. వీరిద్దరి మూర్తిమత్వం ఒకేలా ఉంటుంది. అందుకే వారంత సన్నిహితంగా మెలుగుతారు' అని నెహ్రా అన్నాడు.

'అయితే అన్ని అంశాల్లో వారు ఏకాభిప్రాయంతో ఉండరు. కొన్నింట్లో విభేదిస్తారు. అవతలి వారి అభిప్రాయాలను జాగ్రత్తగా విని పరిష్కారానికి వస్తారు. కోచ్‌ లేదా కెప్టెనే తుది నిర్ణయం తీసుకుంటారని అనుకోవద్దు. నా వరకైతే 50-50 భాగస్వామ్యం అవసరం' అని నెహ్రా పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details