గత దశాబ్దంలో టీ20 క్రికెట్ విపరీతంగా అభివృద్ధి చెందిందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. బ్యాట్స్మెన్ మ్యాచులను గెలిపిస్తే బౌలర్లు టోర్నీలను గెలిపిస్తున్నారని ప్రశంసించాడు. ఈ దశాబ్దంలో తన దృష్టిలో టాప్ 4 టీ20 బౌలర్లు ఎవరో వివరించాడు. ఆ వీడియోను ట్వీట్ చేసి అభిమానులు తమ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరాడు.
టీ20లు వచ్చాక బౌలర్ల విలువ పెరిగిందని ఆకాశ్ అన్నాడు. బ్యాట్స్మెన్ మ్యాచులు గెలిపిస్తే తాము టోర్నీలను గెలిపిస్తామని బౌలర్లు సవాల్ చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇందుకెన్నో ఉదాహరణలు ఉన్నాయని తెలిపాడు. ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ ఏటా బౌలర్ల వ్యూహంతోనే బరిలోకి దిగుతోందని గుర్తు చేశాడు. ఆరుగురు బౌలర్ల వ్యూహంతో ప్రత్యర్థులను వణికిస్తోందని తెలియజేశాడు. ఇక టాప్-4 టీ20 బౌలర్ల విషయానికి వస్తే అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన దృష్టిలో నంబర్ వన్ అని వెల్లడించాడు. లసిత్ మలింగ, సునిల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా మిగిలిన బౌలర్లని పేర్కొన్నాడు.
"మలింగ టీ20, తెల్లబంతి క్రికెట్లో రాక్స్టార్. అత్యంత నిలకడగా విజయవంతం అయ్యాడు. కొత్త, పాత ఫార్మాట్లో ఆరితేరాడు. ప్రస్తుతం అతడి కెరీర్ కాస్త మందకొడిగా సాగుతున్నా ఒకప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్నాడు. ఇక రెండో బౌలర్ సునిల్ నరైన్. అతడి బౌలింగ్లో ఆడటం చాలా కష్టం. బ్యాట్స్మెన్ కనీసం సింగిల్స్ తీయలేరు. ఓవర్లకు ఓవర్లు మెయిడిన్ చేయగలడు. కరీబియన్ ప్రీమియర్ లీగులో సూపర్ఓవర్ను సైతం మెయిడిన్గా విసిరాడంటేనే అతడి సత్తాను అర్థం చేసుకోవచ్చు. మూడో బౌలర్ రషీద్ ఖాన్. అతడు గత దశాబ్దం ప్రథమార్ధంలో ఆడకున్నా రెండో భాగంలో ఆధిపత్యం చెలాయించాడు. అతడితో కలిసి ఆడినవాళ్లకు, ప్రత్యర్థులకు అతడి వ్యూహాలేంటో ఇప్పటికీ అర్థంకావు. మ్యాచు సందర్భాన్ని బట్టి ఎప్పుడు దూస్రా వేస్తాడో, ఎప్పుడు లెగ్స్పిన్ వేస్తాడో తెలియదు. సాధారణంగా అతడి బౌలింగ్లో డిఫెండ్ చేసినా బ్యాట్స్మెన్ ఔటవుతుంటారు. ప్యాడ్లకు తగిలి వికెట్ల ముందు దొరికిపోతారు. టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఆడటం చాలా కష్టం. అతడు విసిరే యార్కర్లు ఎంతో కఠినంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ అందరినీ విశ్లేషిస్తే రషీద్కు తొలి ర్యాంకు ఇస్తాను. ఎందుకంటే అతడు పరుగులు నియంత్రించడమే కాకుండా వికెట్లూ తీస్తాడు. పవర్ప్లే, మధ్య, డెత్ ఓవర్లలోనూ బంతులు విసరగలడు' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఇదీ చూడండి: ఐపీఎల్: ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడు అతడేనా?