ఇంగ్లాండ్ సారథి జో రూట్పై ప్రశంసలు కురిపించాడు ఆ దేశ మాజీ ఓపెనర్ జెఫ్రీ బాయ్కాట్. ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్లో 200 టెస్టులు ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతోన్న భారత దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్(15,921)ను అధిగమిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. లిటిల్ మాస్టర్ రికార్డును తిరగరాసే సత్తా, ప్రతిభ రూట్కు ఉన్నాయని కొనియాడాడు.
తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ 2-0తేడాతో సిరీస్ను కైవసం చేసుకుని ప్రత్యర్థి జట్టును వైట్వాష్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రూట్.. తొలి టెస్టులో డబుల్ సెంచరీ, రెండో టెస్టులో సెంచరీతో రికార్డులను నెలకొల్పాడు. ఈ క్రమంలోనే తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన జెఫ్రీ బాయ్కాట్, డేవిడ్ గోవర్(8,231), కెవిన్ పీటర్సన్(8,181)ను వెనక్కునెట్టి 8,238 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు జెఫ్రీ.
"నన్ను, డేవిడ్ గోవర్, కెవిన్ పీటర్సన్ను అధిగమించి ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డు నెలకొల్పాడు. దాన్ని మర్చిపోండి. అతడికి కెరీర్లో 200 టెస్టులు ఆడే సత్తా ఉంది. సచిన్ రికార్డును తిరగరాస్తాడు. రూట్ వయసు 30ఏళ్లే. ఇప్పటికీ అతడు 99 టెస్టులు మాత్రమే ఆడి 8,249 పరుగులు చేశాడు. అతడికి ఏ గాయం కాకుండా కెరీర్ సాఫీగా సాగితే తెందుల్కర్(15,927) ఆల్ టైమ్ రికార్డును తప్పకుండా బద్దలకొడతాడు. అతడిని మాజీలతో పోల్చవద్దు. సమవుజ్జీలైన కోహ్లీ, స్మిత్, కేన్ విలియమ్సన్ లాంటి అద్భుత ఆటగాళ్లతో పోల్చాలి. ఎందుకంటే ఆ కాలంలో వారు, ప్రస్తుత తరంలో వీరు గొప్ప ఆటగాళ్లు."