తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీలో 'దాదా'గిరికి క్రికెట్​ బోర్డుల మద్దతు!

సౌరభ్​ గంగూలీ ఐసీసీ ఛైర్మన్​ అయ్యే అర్హత ఉందని ఇటీవలే దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్​ వర్గాల్లో చర్చను రేపుతున్నాయి. ఎందుకంటే బీసీసీఐ అధ్యక్ష పదవికీ దాదా ఇలానే చడీచప్పుడు లేకుండా ఎన్నికయ్యాడు. అయితే ఒకటి రెండు దేశాల క్రికెట్​ బోర్డులు మినహా మిగిలినవన్నీ గంగూలీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు దాదా ఈ ఎన్నికలో పోటీ చేస్తాడా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు.

By

Published : May 23, 2020, 6:49 AM IST

Praposing Sourav Ganguly name for ICC Chairman Post
ఐసీసీలో 'దాదా'గిరికి క్రికెట్​ బోర్డుల మద్దతు!

గత ఏడాది సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నట్లు ముందుగా వార్తలొచ్చినప్పుడు వాటిని ఊహాగానాల్లాగే చూశారందరూ! కానీ కొన్ని రోజుల్లోనే వేగంగా పరిణామాలు మారిపోయాయి. అనూహ్యంగా గంగూలీ బీసీసీఐ సింహాసనంపై కూర్చునేశాడు.

ఇప్పుడు అనుకోకుండా సౌరభ్‌ ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడంపై చిన్న చర్చ మొదలైంది. ఇది చూస్తుండగానే విస్తృతమైంది. ఉన్నట్లుండి దాదా.. ఐసీసీ పెద్ద పదవికి ఫేవరెట్‌గా మారిపోయాడు. బీసీసీఐ బాస్‌ అయిన తరహాలోనే అతను త్వరలోనే ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపడితే ఆశ్చర్యమేమీ లేదు!

భారత్‌లో క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ.. అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌ పదవికి అనూహ్యంగా రేసులోకి వచ్చాడు. అతణ్ని ఆ పదవిలో కూర్చోబెట్టడానికి మెజారిటీ క్రికెట్‌ దేశాల బోర్డులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఇప్పటికే దాదాకు తన మద్దతు ప్రకటించాడు. బీసీసీఐతో ఉన్న విభేదాల దృష్ట్యా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ), తమ ఛైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ ఐసీసీ పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మాత్రమే గంగూలీని వ్యతిరేకించేందుకు ఆస్కారముంది. మిగతా బోర్డులకు దాదా విషయంలో ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు. నాలుగేళ్లుగా ఐసీసీ ఛైర్మన్‌ పదవిలో ఉన్న శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం జులైలో జరగబోయే ఐసీసీ వార్షిక సమావేశంతో ముగియబోతుండగా.. అందులోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

మద్దతు ఎందుకిస్తాయంటే..

కరోనా ధాటికి రెండు నెలలుగా క్రికెట్‌ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. రాబోయే కొన్ని నెలల్లోనూ సిరీస్‌లు, టోర్నీలకు అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మినహాయిస్తే అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి బోర్డూ భారత్‌తో సిరీస్‌ కోసం ఎదురు చూస్తోంది. భారత్‌తో సిరీస్‌ అంటే వందల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో గంగూలీ అభ్యరిత్వానికి పచ్చజెండా ఊపితే బీసీసీఐ కరుణ తమపై ఉంటుందని భావిస్తున్నాయి. అలాగే ప్రపంచ క్రికెట్‌ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఐసీసీకి దాదా లాంటి సమర్థుడి అవసరం ఉందని అంటున్నారు. ఇంతకుముందు గంగూలీ గురువు జగ్‌మోహన్‌ దాల్మియా ఇలాగే ఐసీసీ పదవిని చేపట్టి దాని రూపురేఖలు మార్చేశాడు. ఆదాయాన్ని పెంచాడు. ఇప్పుడు ఆయన శిష్యుడు ఐసీసీ ఛైర్మన్‌ పదవిని చేపట్టి కష్టాల్లో ఉన్న ప్రపంచ క్రికెట్‌ను ఆదుకుంటాడని బోర్డులు ఆశిస్తున్నాయి.

ముందు అది తేలాలి..

గంగూలీ గత ఏడాది అక్టోబరులో బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. అప్పటికే ఐదేళ్లకు పైగా క్యాబ్‌ పదవుల్లో ఉన్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా తొమ్మిది నెలలకు మించి కొనసాగే అవకాశం గంగూలీకి లేదు. విరామ నిబంధన ప్రకారం జులైలో అతను పదవి నుంచి దిగిపోవాలి. ఇంకో మూడేళ్లకు కానీ మళ్లీ బోర్డు అధ్యక్షుడయ్యేందుకు అవకాశం లేదు. అయితే లోధా కమిటీ పెట్టిన విరామ నిబంధనతో పాటు బీసీసీఐ రాజ్యాంగంలో కొన్ని మార్పులు కోరుతూ బీసీసీఐ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. దానిపై ఇంకా విచారణ జరగలేదు. విరామ నిబంధనను తొలగించడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించని పక్షంలో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సిందే. ఆ పరిస్థితుల్లో ఐసీసీ ఛైర్మన్‌ కావడానికి అతడికి అభ్యంతరాలేవీ ఉండవు. అయితే బీసీసీఐలో విరామ నిబంధనను ఎత్తి వేస్తే ఎంతో శక్తిమంతమైన బోర్డుకు అధ్యక్షుడిగా కొనసాగడానికే గంగూలీ మొగ్గు చూపుతాడేమో! ఆ పరిస్థితుల్లో భారత్‌ తరఫున వేరొకరిని ఐసీసీ ఛైర్మన్‌ రేసులో నిలుపుతారా.. లేక ఎన్నికలకు దూరంగా ఉంటారా అన్నది చూడాలి.

ఎప్పుడూ అనూహ్యంగానే..

క్రికెటర్‌గా, క్రికెట్‌ పాలకుడిగా గంగూలీ అత్యున్నత పదవులు చేపట్టడం అనూహ్యంగానే జరిగింది. 2000 మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సమయంలో దాదా అనుకోకుండా టీమ్‌ఇండియా కెప్టెన్‌ అయ్యాడు. జట్టును గొప్ప స్థితికి తీసుకెళ్లాడు. ఇక 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం అనంతర పరిణామాలతో బీసీసీఐ బాగా దెబ్బ తిని సరైన నాయకత్వం కోసం చూస్తుండగా.. గత ఏడాది సౌరభ్‌ బోర్డు అధ్యక్షుడిగా మారాడు. అతను బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి కొన్ని వారాల ముందు ఈ పదవిని చేపట్టడంపై అసలు చర్చే లేదు. కానీ అనూహ్యంగా అతడి పేరు తెరపైకి వచ్చింది. ఉన్నట్లుండి అతను బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు ఐసీసీలోనూ ఇలాంటి పరిణామాలే జరిగి దాదా అనుకోకుండా ఛైర్మన్‌ పదవి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్​ వాయిదా​.. వచ్చే వారం అధికారిక ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details