సాధారణంగా క్రికెటర్ వయసు 35 దాటిందంటే రిటైర్మెంట్ ప్రకటిస్తుంటారు. కొన్ని సందర్భాలలో కొందరు క్రికెటర్లు ఇంకా ముందే కూడా ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. అయితే 34ఏళ్ల లేటు వయసులో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసి రికార్డుకెక్కాడు పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ. 13 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టు దీనికి వేదికైంది. పాక్ తరఫున 243వ టెస్టు క్రికెటర్గా ఎంట్రీ ఇచ్చిన అలీ.. అత్యధిక వయసులో టెస్టు ఎంట్రీ ఇచ్చిన ఆ దేశ ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లోని తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కూడా తీశాడు. అంతకుముందు తొలి స్థానంలో మిరాన్ బక్ష్ (47ఏళ్లు).. జుల్ఫికర్ బాబర్ (34ఏళ్లు), మహ్మద్ అస్లామ్(34ఏళ్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌట్ అయింది. యాసిర్ షా 3, షాహీన్ అఫ్రిదీ 2 వికెట్లతో రాణించారు. తొలి రోజు ఆట ముగిసేసరికి పాక్ 4 వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా 187 పరుగుల వెనుకంజలో ఉంది.