తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2020, 3:05 PM IST

ETV Bharat / sports

ఆస్ట్రేలియాపై మా బౌలర్లదే ఆధిపత్యం: రవిశాస్త్రి

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా బౌలర్లు మరోసారి సత్తా చాటుతారని ప్రధానకోచ్​ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. సీనియర్ పేసర్ ఇషాంత్​​ అందుబాటులో లేకున్నా సరే యువ బౌలర్లు అదరగొడతారని అన్నాడు.

Our 'Fab Five' pacers will dominate in Australia: Ravi Shastri
'మా బౌలర్లు ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చలాయిస్తారు'

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో టీమ్​ఇండియా బౌలర్లు మరోసారి ఆధిపత్యం కొనసాగిస్తారని భారత జట్టు ప్రధానకోచ్​ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 2018-19లో భారత పేసర్లు ఆసీస్​ను దెబ్బతీసిన విధానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

నవంబరు 17 నుంచి జనవరి 19వరకు జరగనున్న పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. తొలి టెస్టుకు ఇషాంత్​ శర్మ అందుబాటులో లేకున్నా టీమ్​ఇండియా బౌలింగ్​ లైనప్​ బలంగా ఉందని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు.

ఇషాంత్​ లేకపోయినా..

"మాకు బ్రహ్మాండమైన బౌలింగ్ లైనప్​ ఉంది. ఇషాంత్​ లేకపోవడం ఫాస్ట్​బౌలింగ్​లో లోటుగా అనిపించినా.. దాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న యువ బౌలర్లు ఉన్నారు. ఈ అవకాశాన్ని యువ క్రికెటర్లు చేజిక్కించుకోవడం సహా తమ నైపుణ్యాన్ని నిరూపించుకునే వీలు కలుగుతుంది" అని రవిశాస్త్రి చెప్పాడు.

అందుబాటులో ఉన్న పేసర్లు

టీమ్​ఇండియా బౌలింగ్ లైనప్​లో సీనియర్లు జస్​ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమి, ఉమేశ్​ యాదవ్​లతో పాటు యువ బౌలర్లు నవదీప్​ సైనీ, మహ్మద్​ సిరాజ్​లు ఉన్నారు. టెస్టుల్లో ఆడటానికి ఇషాంత్​ శర్మ ఇంకా ఆస్ట్రేలియా బయలుదేరకపోవడం వల్ల అతడి రావడంపై అనుమానం వ్యక్తమవుతుంది. ఇషాంత్​ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. ఫిట్​నెస్​ పరీక్షల్లో నెగ్గిన తర్వాతే ఆస్ట్రేలియా బయలుదేరే అవకాశం ఉంది.

ఒకే మ్యాచ్​ ఆడిన అనుభవం

నాలుగు టెస్టుల సిరీస్​లో మొదటిది అడిలైడ్​ వేదికగా జరగనుంది. ఇది డే/నైట్ విధానంలో​ జరగనుంది. "ఇదంతా మ్యాచ్​ జరిగే మైదానాలపై ఆధారపడి ఉంటుంది. మనకు అనుభవం లేని పింక్​-బాల్​ మ్యాచ్​తో సిరీస్​ను ప్రారంభించనున్నాం. ఇప్పటివరకు మా జట్టు ఈ తరహాలో ఒక్క​ టెస్టు (కోల్​కతాలో బంగ్లాదేశ్​తో) మాత్రమే ఆడింది. కానీ, ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చాలా వ్యత్యాసం ఉంది" అని రవిశాస్త్రి తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details