తెలంగాణ

telangana

By

Published : Feb 5, 2020, 5:27 AM IST

Updated : Feb 29, 2020, 5:41 AM IST

ETV Bharat / sports

జోరుమీదున్న కోహ్లీసేన.. గెలుపు కోసం కివీస్

న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసి జోరుమీదుంది టీమిండియా. అదే ఊపును వన్డేల్లోనూ కొనసాగించాలని అనుకుంటోంది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే హామిల్టన్ వేదికగా నేడు జరగనుంది.

కోహ్లీసేన.
కోహ్లీసేన.

న్యూజిలాండ్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుపై 5-0 తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత క్రికెట్‌ జట్టు.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హామిల్టన్ వేదికగా నేడు మొదటి వన్డే జరగనుంది. పొట్టి ఫార్మాట్​ సిరీస్​ కైవసం చేసుకున్న విశ్వాసంతో టీమిండియా బరిలో దిగుతుండగా కోహ్లీసేన జోరుకు కళ్లెం వేయాలని ఆతిథ్య కివీస్‌ భావిస్తోంది. గాయం కారణంగా ఇరుజట్లలోని కీలక ఆటగాళ్లు వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. కాలిపిక్క గాయంతో రోహిత్‌ శర్మ పర్యటనకే దూరం కాగా.. భుజం గాయంతో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండట్లేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

చివరి టీ20లో గాయపడిన రోహిత్‌ శర్మ స్థానంలో వన్డే సిరీస్‌కు మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం దక్కింది. అతడితో పాటు యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా కూడా అవకాశం అందుకున్నాడు. ఓపెనర్‌గా రాణిస్తున్న రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు యజమాన్యం నిర్ణయించగా.. హామిల్టన్‌ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ భారత ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నారు. 2016లో కూడా ఇదే తరహాలో కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌ జింబాబ్వేపై అరంగేట్రంలోనే ఓపెనింగ్‌ చేశారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాజ్‌కోట్‌ వన్డేలో ఆడిన విధంగా రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తూ, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని టీమిండియా సారథి కోహ్లీ తెలిపాడు. కోహ్లీ మూడు, శ్రేయాస్ అయ్యర్‌ నాలుగో స్థానంలోనే ఆడనున్నారు. మనీశ్‌ పాండేకు అవకాశమిస్తే.. ఆల్‌రౌండర్‌ కోటా కోసం దూబె, జడేజా, కేదార్‌ జాదవ్‌ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది.

న్యూజిలాండ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్‌లో పూర్తిగా విఫలమైన జట్టుకు కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. భుజం గాయంతో కేన్ తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఇతడి బదులుగా టామ్ లేథమ్ కివీస్‌కు సారథ్యం వహించనున్నాడు. టీమిండియాతో జరిగిన మూడో టీ20లో విలియమ్సన్‌ ఎడమ భుజానికి గాయమైంది. తీవ్రత పెద్దగా లేకున్నా కాస్త విశ్రాంతి అవసరమని వైద్యుల సూచించినట్లు సమాచారం. ఇతడి స్థానంలో బ్యాట్స్‌మన్ మార్క్ ఛాప్‌మన్ రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాడు. ఆల్‌ రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ జట్టులోకి చేరడం కివీస్‌కు సానుకూలాంశం.

ప్రపంచకప్‌ తర్వాత భారత్‌కు ఇది మూడో వన్డే సిరీస్‌ కాగా న్యూజిలాండ్‌కు ఇదే మొదటిది. ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత కివీస్ ఇంతవరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. భారత్‌ మాత్రం వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో తలపడి గెలిచింది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఓడిన టీమిండియా ఈ సిరీస్‌ గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.

అండర్ 19: సక్సేనా అద్భుత క్యాచ్ చూశారా..!

Last Updated : Feb 29, 2020, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details