కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పలు టోర్నీలు వాయిదా పడగా, మరికొన్ని రద్దయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధిక వాయిదా వేశారు. అయితే టోర్నీ అసలు జరుగుతుందా? లేదా? అనే విషయంపై, మైటీమ్ ఎలెవన్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దాదాపు 60 శాతం మంది లీగ్ జరగడం తథ్యమని ఓటేశారు. స్టేడియంలో ప్రేక్షకుల లేకుండా నిర్వహిస్తే మంచిదని మరో 13 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐపీఎల్-2020.. ఈ ఏడాది జరగడం పక్కా!
ఈ ఏడాది ఐపీఎల్ జరిగి తీరుతుందని, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో 60 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల్లేకుండా నిర్వహిస్తే బాగుంటుందని 13 శాతం మంది భావించారు.
10 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో.. ఈ ఏడాదిలో ఐపీఎల్ జరుగుతుందని 60 శాతం మంది, సంవత్సరం చివరి కల్లా క్రీడలు ప్రారంభమవుతాయని 80 శాతం మంది అంచనా వేశారు. స్టేడియాలకు వెళ్లి చూసేందుకు 40 శాతం మంది నిరాసక్తి చూపించారు.
కరోనా వల్ల ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్.. వచ్చే ఏడాదికి వాయిదా పడగా, వింబుల్డన్ టోర్నీకి ఇదే పరిస్థితి ఎదురైంది. అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్పైనా సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ వరల్డ్కప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది.