తెలంగాణ

telangana

పాక్ ఆటగాళ్లు అజామ్, హఫీజ్ రికార్డులు

By

Published : Aug 31, 2020, 11:24 AM IST

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో పాక్ ఆటగాళ్లు మహ్మద్ హఫీజ్, బాబర్ అజామ్ రికార్డులకెక్కారు. హఫీజ్ పొట్టి ఫార్మాట్​లో 2 వేల పరుగుల్ని పూర్తి చేయగా, అజామ్ అత్యంత వేగంగా 1500 పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ, ఫించ్ సరసన చేరాడు.

ఆ ఘనత సాధించిన హఫీజ్, అజామ్
ఆ ఘనత సాధించిన హఫీజ్, అజామ్

ఇంగ్లాండ్​-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ మైలురాయిని చేరుకున్నాడు పాక్ సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్. ఈ దేశం తరఫున పొట్టి ఫార్మాట్​లో 2 వేల పరుగుల్ని సాధించిన రెండో బ్యాట్స్​మన్​గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు షోయబ్ మాలిక్ ఈ ఘనత సాధించాడు.

హఫీజ్

కెరీర్​లో 93వ మ్యాచ్​ ఆడిన హఫీజ్ ఇందులో 36 బంతుల్లో 69 పరుగులతో సత్తాచాాటాడు. ఈక్రమంలోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇతడు ఇప్పటివరకు 82 మ్యాచ్​ల్లో 2794 పరుగులు చేశాడు. అలాగే రోహిత్ శర్మ 108 మ్యాచ్​ల్లో 2773 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో మార్టిన్ గప్తిల్, షోయబ్ మాలిక్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

బాబర్ అజామ్ రికార్డు

ఇదే మ్యాచ్​లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్​లో 1500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 39 ఇన్నింగ్స్​ల్లో ఈ ఫీట్ సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ సరసన చేరాడు.

ఇంగ్లాండ్​దే విజయం

కెప్టెన్‌ మోర్గాన్‌ (66; 33 బంతుల్లో 64, 46), మలన్‌ (54 నాటౌట్‌; 36 బంతుల్లో 64, 16) మెరుపులతో రెండో టీ20లో ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఆదివారం మొదట పాక్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. హఫీజ్‌ (69), బాబర్‌ అజామ్‌ (56) రాణించారు. ఛేదనలో బెయిర్‌స్టో (44), బాంటన్‌ (20) తొలి వికెట్‌కు 6.2 ఓవర్లనే 66 పరుగులు జత చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ వెనుదిరిగినా.. మోర్గాన్‌, మలన్‌ మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించి జట్టును విజయపథంలో నడిపారు. 17 పరుగుల తేడాతో 3 వికెట్లు పడడంతో ఉత్కంఠ నెలకొన్నా.. మలాన్‌ జోరు కొనసాగించి ఇంకో 5 బంతులుండగానే జట్టును గెలిపించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవగా.. చివరి టీ20 మంగళవారం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details