టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటకు ఎంతో మంది క్రికెట్ అభిమానులున్నారు. మైదానంలో మహీ హెలికాప్టర్ షాట్లు కొడితే ప్రేక్షకులు ఆనందంతో గెంతులు వేస్తారు. ఇంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ధోనీకి కార్లు, బైక్లంటే ఎంతో ఇష్టం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాహనాల్లో తనకు నచ్చిన వాటిని సేకరిస్తూ ఉండటం మాహీకి సరదా.
న్యూజిలాండ్తో జరిగిన 2019 క్రికెట్ ప్రపంచకప్ సెమీఫైనల్లో చివరిసారిగా భారత్కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఇంట్లో అనేక లగ్జరీ కార్లు దర్శనమిస్తాయి. ఫెరారీ 599 జీటీఓ, యమహా ఆర్డీ 350 ఇలా తదితర వాహనాలు ఇందులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీటిని కొనడమే కాదు, వాటి యంత్ర భాగాల అమరిక గురించీ ధోనీకి క్షుణ్నంగా తెలుసు .
10కిపైగా కార్లు...
లగ్జరీ కార్లపై ధోనీకి ఉన్న ప్రేమ అతని అభిమానులకు సుపరిచితమే. ఇప్పటి వరకు సుమారు 10కార్లకు పైగా సేకరించాడు. వీటిలో ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్ హెచ్2, జీఎంసీ సియెర్రా సహా పలు అత్యాధునిక కార్లకు మాహీ యాజమాని. గతేడాది మరో కారును తన గ్యారేజీలో చేర్చాడు. జోంగా అనే ఈ వాహనాన్ని భారత సైన్యంలో ఉపయోగిస్తారు.