తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విధేయతే అన్నింటికన్నా ముఖ్యం..'కోహ్లీ భావోద్వేగ పోస్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఆర్సీబీతో తన ప్రయాణం ఎలా సాగిందో తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇది కాస్త నెట్టింట వైరల్​గా మారింది.

By

Published : Aug 9, 2020, 4:08 PM IST

కోహ్లీ భావోద్వేగ పోస్ట్
కోహ్లీ భావోద్వేగ పోస్ట్

వచ్చే నెల 19 నుంచి యూఏఈలో ఆరంభమయ్యే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆగలేకపోతున్నానని చెప్పాడు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసిన అతడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు(ఆర్సీబీ) జట్టులో తన ప్రయాణం ఎలా సాగిందో చూపించాడు. దానికి విధేయతే అన్నిటికన్నా ముఖ్యమని పేర్కొంటూ ఓ క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే, ఈ పోస్టు పెట్టిన గంటలోపే కోటి యాభై లక్షల మందికిపైగా వీక్షించారు.

కోహ్లీ గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక డే/నైట్‌ టెస్టులో శతకం బాదాడు. ఆ తర్వాత పూర్తిగా ఫామ్‌ కోల్పోయి సతమతమయ్యాడు. దాదాపు 20 ఇన్నింగ్స్‌లపైగా బ్యాటింగ్‌ చేసినా అస్సలు రాణించలేకపోయాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌ పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక టీమ్‌ఇండియా స్వదేశానికి తిరిగొచ్చాక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ వాయిదా పడింది. అనంతరం లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఇంటికే పరిమితయ్యాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో ఎలా రాణిస్తాడనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఆర్సీబీ జట్టు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయింది. ప్రతిసారి భారీ అంచనాలతో అడుగుపెట్టడం, కీలక మ్యాచ్‌ల్లో ఓటమి చెందడం పరిపాటిగా మారింది. దాంతో ఇప్పుడైనా కప్పు గెలవాలని పట్టుదలగా ఉంది. అందుకోసం డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ను తమ జట్టులోకి తీసుకొంది. అతడు కూడా ఈసారి ఆర్సీబీతో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఈసారి వీలైతే తాను మంచి పరుగులు చేసి కోహ్లీపై భారాన్ని తగ్గించడానికి కృషి చేస్తానన్నాడు. అలాగైనా కోహ్లీ కల నెరవేరుతుందేమో చూడాలి మరి.

లాక్‌డౌన్‌ కారణంగా నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆర్సీబీ కెప్టెన్‌ ఆ సమయంలోనూ ఫిట్‌నెస్‌ కోల్పోలేదు. ఇంటి వద్దే వ్యాయామాలు కొనసాగించి ఎప్పటిలాగే శారీరకంగా దృఢంగా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌పై స్పష్టత రావడం వల్ల త్వరలోనే మైదానంలో సాధన మొదలుపెట్టే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details