తెలంగాణ

telangana

ETV Bharat / sports

కపిల్​దేవ్​ చేతుల్లో టీమిండియా కోచ్​ ఎంపిక..!

భారత లెజెండరీ క్రికెటర్​ కపిల్​దేవ్​ టీమిండియా నూతన కోచ్​ ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నాడు. కపిల్​ ​నేతృత్వంలో తాత్కాలిక క్రికెట్​ సలహా​ కమిటీ(సీఏసీ)ని​ నియమించేందుకు ప్రణాళిక రచిస్తోంది బీసీసీఐ పాలకమండలి. సుప్రీం కోర్టు నియమించిన పరిపాలకుల కమిటీ(సీఓఏ)లో ఇది ఉపకమిటీగా ఉండనుంది.

By

Published : Jul 18, 2019, 7:32 AM IST

కపిల్​దేవ్​ చేతుల్లో టీమిండియా కోచ్​ ఎంపిక..!

భారత జట్టు మాజీ కెప్టెన్​ ​కపిల్​దేవ్ ఆధ్వర్యంలో​ టీమిండియా నూతన కోచ్​ ఎంపిక ప్రక్రియ జరగనుంది. అతడి అధ్యక్షతన తాత్కాలిక 'క్రికెట్​ సలహా​ కమిటీ'(సీఏసీ)​నియమించి ఈ నియామకాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది బీసీసీఐ పాలకమండలి.

బీసీసీఐ పరిపాలకుల కమిటీ

తాత్కాలిక ప్యానెల్​...

తాత్కాలిక 'సీఏసీ' ప్యానెల్​లో భారత మాజీ కెప్టెన్​ కపిల్​ దేవ్​, అన్షుమాన్​ గైక్వాడ్​, శాంతా రంగస్వామి సభ్యులు. ఈ ముగ్గురే డిసెంబర్​లో భారత మహిళా జట్టు కోచ్​గా​ డబ్ల్యూ.వీ రమణ్​ను నియమించారు. పురుషుల జట్టుకు నూతన కోచ్​ ఎంపిక చేసేందుకు మళ్లీ వీరినే బీసీసీఐ సంప్రదించినట్లు తెలుస్తోంది.

తాత్కాలిక సీఏసీలో కపిల్​, అన్షుమాన్​, శాంతా

సచిన్​, గంగూలీ, లక్ష్మణ్​ స్థానంలో...

గతంలో 'సీఏసీ' ప్యానెల్​లో సభ్యులుగా మాజీ క్రికెటర్లు సచిన్​ తెందూల్కర్​, సౌరభ్​ గంగూలీ, వీవీఎస్​ లక్ష్మణ్​ ఉండేవారు. అయితే ఈ ముగ్గురూ 'పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన' కింద రెండు పదవుల్లో ఉండకూడదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా ముగ్గరూ ప్యానెల్​ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐ పాలకమండలి కొత్తగా తాత్కాలిక ప్యానెల్​ను కపిల్​ నేతృత్వంలో ఏర్పాటు చేసి... కొత్త కోచ్​ నియామకం చేపట్టే యోచనలో ఉంది.

పాత సీఏసీలో గంగూలీ, లక్ష్మణ్​, సచిన్​

అయితే గతంలో జాతీయ మహిళా జట్టులో​ ఎంపిక రాజ్యాంగ బద్ధంగా జరగలేదని ఆరోపించింది డయానా. పూర్తిస్థాయిలో ఉన్న సీఏసీ ప్యానెల్​ మాత్రమే సెలక్షన్​ ప్రక్రియ చేయాలని తాత్కాలిక కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

సుప్రీం ఆదేశం...

భారత క్రికెట్​ జట్టు నియామకాల్లో పారదర్శకత తెచ్చేందుకు సుప్రీం కోర్టు... పరిపాలకుల కమిటీ(సీఓఏ) ఏర్పాటును సూచించింది. ఇందులో మొదట ఇద్దరు సభ్యులతో కూడిన ప్యానెల్​ ఉండేది. దీనిలో ఛైర్మన్​గా వినోద్​ రాయ్​, భారత మాజీ కెప్టెన్​ డయానా ఎడుల్జీ సభ్యులు. ఫిబ్రవరిలో లెఫ్ట్​నెంట్​ జనరల్​ రవి తోడ్గేను మూడో వ్యక్తిగా నియమించింది ప్రభుత్వం.

సరికొత్తగా నోటిఫికేషన్​...

టీమిండియా ప్రధాన కోచ్‌, సహాయక బృందానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్​లో వయసు, అనుభవం నిబంధనలు విధించింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్లు అంతర్జాతీయ అనుభవం ఉండాలని, వయసు 60 ఏళ్లకు మించరాదని స్పష్టం చేసింది.

ప్రధాన కోచ్‌ సహా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్ట్​, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పదవులకు నియామకాలు చేపట్టనుంది భారత క్రికెట్​ బోర్డు. జులై 30 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details