ప్రపంచకప్లో భారత్ సెమీస్లోనే ఓడిపోవడం వల్ల కోహ్లీ నాయకత్వంపై చర్చ మొదలైంది. విరాట్ను టెస్టులకు మాత్రమే పరిమితం చేసి... వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించాలని సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. వీటికి తోడు విరాట్, రోహిత్ మధ్య అంతర్గత విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు సమాధానమిచ్చాడు కోహ్లీ. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు మాత్రం వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని..." టీమిండియా సారథిగా కోహ్లీ స్థానాన్ని రోహిత్ భర్తీ చేయగలడా?" అని ట్విట్టర్లో ప్రశ్నించాడు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు.
" కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తొలగించరని అనుకుంటున్నా. ఎందుకంటే అతడు చాలా విలువైన ఆటగాడు. గత 3 నుంచి 4 ఏళ్లుగా సారథిగా ఉన్నాడు. ఇప్పడు విరాట్కు మంచి కోచ్, ఎంపిక కమిటీ సహాయం అవసరం. అవన్నీ తగినట్టు ఉంటే కోహ్లీ నుంచి మంచి ప్రదర్శన లభిస్తుంది. రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో సందేహమే లేదు. ఐపీఎల్లో తనదైన ప్రతిభ చూపించాడు. అయినప్పటికీ ఇలాంటి సున్నితమైన అంశాన్ని కదిలించకుండా కోహ్లీనే కెప్టెన్గా కొనసాగించాలి. విరాట్ను సారథిగా తప్పించాలని కోరడం నిజంగా హాస్యాస్పదం ".
--షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్