తెలంగాణ

telangana

By

Published : Sep 1, 2020, 7:32 PM IST

Updated : Sep 1, 2020, 7:39 PM IST

ETV Bharat / sports

ఐపీఎల్​: లీగ్​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడిన క్రికెటర్లు వీరే!

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) ప్రారంభం నుంచి యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వారితో ఏ మాత్రం తగ్గకుండా సీనియర్​ క్రికెటర్లూ పోటీపడుతున్నారు. ఐపీఎల్​ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎక్కువ మ్యాచ్​లు ఆడిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ప్రస్తుతం ఏ ఫ్రాంఛైజీలో ఉన్నారో తెలుసుకుందాం.

IPL 2020: Players with the most IPL appearances
ఐపీఎల్​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడిన క్రికెటర్లు వీళ్లే!

క్రికెట్ టోర్నీలు లేకుండా ఐదు నెలలు గడిచిపోయింది. దీంతో ఐపీఎల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాల కోసం పరితపిస్తున్నారు. అయితే కొందరు ఆటగాళ్లు చాలా ఏళ్లుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. టోర్నీలోనూ కీలకంగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో అత్యధిక మ్యాచ్​లు ఆడిన అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గురించి తెలుసుకుందామా.

1)మహేంద్రసింగ్ ధోనీ (చెన్నై సూపర్​ కింగ్స్​)

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోనీ.. ఐపీఎల్​లో ఇప్పటివరకు 190 మ్యాచ్​లు ఆడాడు. ధోనీ కంటే మూడు మ్యాచ్​లు ఎక్కువ ఆడి అత్యధిక ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడిన క్రికెటర్​గా సురేశ్​ రైనా ఘనత సాధించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్​ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా ఇటీవలే తెలిపాడు. దీంతో ఐపీఎల్​లో సీఎస్కే తరఫున ప్రస్తుతం అత్యధిక మ్యాచ్​లు ఆడిన అనుభవం ధోనీకి మాత్రమే ఉంది.

యంఎస్​ ధోనీ

2008లో ఐపీఎల్​ ప్రారంభంలో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ఎంపికైన ధోనీ.. ఆ తర్వాత మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలతో సీఎస్కేపై రెండేళ్ల నిషేధం కారణంగా 2016, 2017 ఐపీఎల్​లో రైజింగ్​ పుణె సూపర్​ జెయింట్స్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. మహీ తన ఐపీఎల్​ కెరీర్​లో 137.85 స్ట్రైక్​రేట్​తో 4,432 పరుగులు చేశాడు. అందులో 23 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 84 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు.

2)రోహిత్​ శర్మ (ముంబయి ఇండియన్స్​)

ఐపీఎల్​లో ఇప్పటివరకు అద్భుతమైన రికార్డు కలిగిన ఆటగాళ్లలో ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ కూడా ఉన్నాడు. ఐపీఎల్​లో ఇప్పటివరకు 188 మ్యాచ్​ల్లో 130.82 స్ట్రైక్​రేట్​తో 4,898 పరుగులను నమోదు చేయగా అందులో ఒక శతకంతో పాటు 36 అర్ధ శతకాలున్నాయి. ఈ టోర్నీలో అత్యధికంగా 109 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు రోహిత్.

రోహిత్​ శర్మ

ఐపీఎల్​ ప్రారంభం నుంచి 2010 వరకు వరుసగా మూడేళ్ల పాటు హైదరాబాద్​ జట్టులో ఉన్నాడు రోహిత్​శర్మ. 2011లో జరిగిన ఐపీఎల్​ వేలంలో ముంబయి ఇండియన్స్​ జట్టు రోహిత్​ను సొంతం చేసుకుని 2013లో కెప్టెన్​ బాధ్యతలు అప్పగించింది. దక్కన్​ ఛార్జర్స్​ తరపున ఒకసారి.. ముంబయి ఇండియన్స్​ తరపున నాలుగు సార్లు ఐపీఎల్​ ట్రోఫీ దక్కించుకున్న క్రికెటర్​గా అరుదైన ఘనత సాధించాడు హిట్​మ్యాన్.

3) దినేశ్​ కార్తిక్​ (కోల్​కతా నైట్​రైడర్స్​)

కోల్​కతా​ సాధించిన ఎన్నో కీలకమైన విజయాల్లో భాగమయ్యాడు వికెట్​ కీపర్-బ్యాట్స్​మన్​ దినేశ్​ కార్తిక్​. ఐపీఎల్​లో ఇప్పటివరకు 182 మ్యాచ్​ల్లో ఆడి.. 3,654 పరుగులను నమోదు చేయగా అందులో 18 అర్ధ శతకాలున్నాయి. ఈ టోర్నీలో అత్యధికంగా 97 పరుగులు చేశాడు కార్తిక్​.

దినేష్​ కార్తిక్​

2018లో ఇతడిని కెప్టెన్​గా నియమించింది కేకేఆర్​. జట్టును నడిపించడంలో దినేశ్​ కార్తిక్​ విజయం సాధించాడనే చెప్పాలి. ప్రస్తుత సీజన్​లో ఇతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది.

4)రాబిన్​ ఉతప్ప (రాజస్థా​న్​ రాయల్స్​)

ఆరేళ్ల పాటు కోల్​కతా నైట్​రైడర్స్​కు ఆడిన రాబిన్​ ఉతప్ప.. ప్రస్తుత సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​ జట్టులో ఆడనున్నాడు. కేకేఆర్​ తరపున అద్భుత ఇన్నింగ్స్​లు​ ఆడిన ఇతడి అనుభవం ఇప్పుడు తమకు పనికొస్తుందని ​రాజస్థాన్ భావిస్తోంది. ఐపీఎల్​లో ఇప్పటివరకు 177 మ్యాచ్​ల్లో 130.50 స్ట్రైక్​రేట్​తో 4,411 పరుగులు నమోదు చేశాడు. అందులో 24 అర్ధ శతకాలున్నాయి.

రాబిన్ ఉతప్ప

5) విరాట్​ కోహ్లీ (రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు)

ఐపీఎల్​లో ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడిన ఏకైక ఆటగాడు విరాట్​ కోహ్లీ. 2008లో అండర్​-19 ప్రపంచకప్​లో టీమ్​ఇండియాకు కెప్టెన్​గా వ్యవహరించి జట్టును విజేతగా నిలబెట్టడం వల్ల వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రారంభ ఐపీఎల్​ వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇతడిని దక్కించుకుంది.

విరాట్​ కోహ్లీ

ఐపీఎల్​లో ఇప్పటివరకు 177 మ్యాచ్​లు ఆడి 131.61 స్ట్రైక్​రేట్​తో 5,412 పరుగులు నమోదు చేయగా.. అందులో 5 శతకాలు, 36 అర్ధ శతకాలున్నాయి. ఈ టోర్నీలో కోహ్లీ అత్యధికంగా 113 రన్స్​ చేశాడు.

6) శిఖర్​ ధావన్​ (దిల్లీ క్యాపిటల్స్​)

యువ క్రికెటర్లతో పాటు అనుభజ్ఞులైన ఆటగాళ్లతో ప్రస్తుత ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ బలంగా మారింది. ఈ ఫ్రాంచైజీలో ముఖ్యమైన ఆటగాళ్లలో టీమ్ఇండియా క్రికెటర్​ శిఖర్​ ధావన్​ ముందుంటాడు.

శిఖర్​ ధావన్​

ఐపీఎల్​లో ఇప్పటివరకు 159 మ్యాచ్​లు ఆడాడు గబ్బర్. ఈ టోర్నీలో 4,579 పరుగులను నమోదు చేయగా అందులో 37 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్​లో ​ధావన్​ అత్యధిక స్కోరు 97గా ఉంది.

7) మనీష్​ పాండే (సన్​రైజర్స్​ హైదరాబాద్​)

ఐపీఎల్​ 2009లో సెంచరీ చేసి.. లీగ్​లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా మనీష్​ పాండే గుర్తింపు పొందాడు. టోర్నీ ప్రారంభంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన మనీష్​.. అప్పటి నుంచి మూడు వేర్వేరు జట్లకు ఆడి ఐపీఎల్​ కెరీర్​లో 130 మ్యాచ్​ల్లో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ఒక సెంచరీ, 15 హాఫ్​ సెంచరీలతో 2,843 పరుగులను నమోదు చేశాడు. అత్యధికం 114 రన్స్​.

మనీష్​ పాండే

ప్రస్తుతం మనీష్​.. సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టులో మిడిలార్డర్​​ బ్యాట్స్​మన్​గా రాణిస్తున్నాడు. 2014 నుంచి 2017 వరకు కోల్​కతా జట్టులో విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

8) క్రిస్​గేల్​ (కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​)

ఐపీఎల్​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక విదేశీ ఆటగాడు క్రిస్​ గేల్​. గేల్​ కొన్నేళ్లుగా ఐపీఎల్​లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్​లతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో 125 మ్యాచ్​ల్లో 151.02 స్ట్రైక్​ రేట్​తో 4,484 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 28 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్​లో గేల్​ అత్యధికంగా 175 రన్స్​ చేసి నాటౌట్​గా నిలిచాడు.

క్రిస్​ గేల్​

కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టులో తన ఐపీఎల్​ కెరీర్​ ప్రారంభించినప్పటికీ.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో ఏడేళ్ల కాలంలో ఎన్నో విజయాలలో భాగమయ్యాడు గేల్. ఐపీఎల్​ 2018 నుంచి కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడీ విధ్వంసకర బ్యాట్స్​మన్​.

Last Updated : Sep 1, 2020, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details