తెలంగాణ

telangana

టీమ్ఇండియాకు ముచ్చెమటలు పట్టించిన బంగ్లా!

2016 టీ20 ప్రపంచకప్​లో టీమ్ఇండియాకు షాక్ ఇచ్చినంత పని చేసింది బంగ్లాదేశ్. ఈ మెగాటోర్నీలో జరిగిన గ్రూప్ మ్యాచ్​లో ధోనీసేన తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్ సరిగ్గా ఐదేళ్ల క్రితం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్​ను మరోసారి గుర్తు చేసుకుందాం.

By

Published : Mar 23, 2021, 12:36 PM IST

Published : Mar 23, 2021, 12:36 PM IST

ETV Bharat / sports

టీమ్ఇండియాకు ముచ్చెమటలు పట్టించిన బంగ్లా!

INDvsBAN
టీమ్ఇండియాకు ముచ్చెమటలు పట్టించిన బంగ్లా

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అప్పుడప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. ఎప్పుడు ఎలా చెలరేగుతుందో ఎవరికీ అంతుబట్టదు. తనదైన రోజు ఏ బలమైన జట్టునైనా ఓడించగలదు. ఈ విషయం భారత క్రికెట్‌ ప్రేమికులకు 2007 వన్డే ప్రపంచకప్‌లోనే తెలిసొచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం కూడా బంగ్లా ఇలానే టీమ్‌ఇండియాకు షాకిచ్చేలా కనిపించింది. ఆ జట్టు విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమైన వేళ ధోనీ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల గెలుపు వరించింది. లేదంటే టీమ్‌ఇండియాకు మరోసారి భంగపాటు తప్పేది కాదు.

టీమ్ఇండియా

తేలిపోయిన టీమ్ఇండియా..

2016 టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా గ్రూప్‌ బిలో జరిగిన ఈ మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. అప్పటికే మంచి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమ్‌ఇండియా చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో పరుగుల వరద పారిస్తుందని అంతా భావించారు. కానీ, టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన అనుకున్నంత స్థాయిలో మెరవలేదు. తొలి వికెట్‌కు రోహిత్‌(18), ధావన్‌(23).. 42 పరుగులు జోడించి శుభారంభం చేశారు. తర్వాత కోహ్లీ(24), రైనా(30), పాండ్యా(15), ధోనీ(13), యువరాజ్‌(3) ఎవరూ పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. దాంతో టీమ్ఇండియా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 146/7 స్కోర్‌ సాధించింది. ఈ స్కోరు చూశాక మ్యాచ్​పై ఆశలు వదులుకున్నారు అభిమానులు.

జడేజా అప్పీల్

ఆడుతూ పాడుతూ

లక్ష్యం పెద్దది కాకపోవడం వల్ల బంగ్లాదేశ్‌ కూడా ఆడుతూ పాడుతూ పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు తగిన రన్‌రేట్‌ను కొనసాగిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. తమీమ్‌ ఇక్బాల్‌(35; 32 బంతుల్లో), షకిబుల్ హసన్‌(22; 15 బంతుల్లో), షబ్బీర్‌ రెహ్మాన్‌(26; 15 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు.

ఆఖరి ఓవర్ ఉత్కంఠ

అయితే, బంగ్లా విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన వేళ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అప్పటికే ధాటిగా ఆడుతున్న రహీమ్‌(11), మహ్మదుల్లా(18) క్రీజులో ఉన్నారు. పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో తొలి మూడు బంతులకు 9 పరుగులు చేశారు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 2 పరుగులుగా మారింది. కానీ ఇక్కడే ధోనీ ఫీల్డింగ్‌ మార్చి తన చతురత ప్రదర్శించాడు. అది ఫలించింది. 19.4 బంతికి రహీమ్‌ ఆడిన షాట్‌ను ధావన్‌ క్యాచ్‌ అందుకోగా, తర్వాతి బంతికే మహ్మదుల్లా క్యాచ్‌ను జడేజా ఒడిసిపట్టాడు. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ ధోనీ ముస్తాఫిజుర్‌(0)ను రనౌట్‌ చేయడం వల్ల బంగ్లా స్కోర్‌ 145/9గా నమోదైంది. టీమ్‌ఇండియా ఒక్క పరుగుతో విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలిచినంత పనిచేసి ధోనీసేనకు చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్‌ జరిగి నేటికి ఐదేళ్లు గడిచాయి.

ABOUT THE AUTHOR

...view details