బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అప్పుడప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. ఎప్పుడు ఎలా చెలరేగుతుందో ఎవరికీ అంతుబట్టదు. తనదైన రోజు ఏ బలమైన జట్టునైనా ఓడించగలదు. ఈ విషయం భారత క్రికెట్ ప్రేమికులకు 2007 వన్డే ప్రపంచకప్లోనే తెలిసొచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం కూడా బంగ్లా ఇలానే టీమ్ఇండియాకు షాకిచ్చేలా కనిపించింది. ఆ జట్టు విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమైన వేళ ధోనీ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల గెలుపు వరించింది. లేదంటే టీమ్ఇండియాకు మరోసారి భంగపాటు తప్పేది కాదు.
తేలిపోయిన టీమ్ఇండియా..
2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా గ్రూప్ బిలో జరిగిన ఈ మ్యాచ్కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. అప్పటికే మంచి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమ్ఇండియా చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో పరుగుల వరద పారిస్తుందని అంతా భావించారు. కానీ, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ధోనీసేన అనుకున్నంత స్థాయిలో మెరవలేదు. తొలి వికెట్కు రోహిత్(18), ధావన్(23).. 42 పరుగులు జోడించి శుభారంభం చేశారు. తర్వాత కోహ్లీ(24), రైనా(30), పాండ్యా(15), ధోనీ(13), యువరాజ్(3) ఎవరూ పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. దాంతో టీమ్ఇండియా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 146/7 స్కోర్ సాధించింది. ఈ స్కోరు చూశాక మ్యాచ్పై ఆశలు వదులుకున్నారు అభిమానులు.