తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2019, 5:46 AM IST

ETV Bharat / sports

భారత్​-వెస్టిండీస్​: ఏడాదిని ఘనంగా ముగించేదెవరు..!

ఒడిశాలోని కటక్​ వేదికగా నేడు వెస్టిండీస్​-భారత్​ జట్ల మధ్య ఆఖరి వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్​ల సిరీస్​ను 1-1తో సమం చేసుకున్నాయి ఇరుజట్లు. నిర్ణయాత్మక పోరులో భారత్ గెలిస్తే.. కరీబియన్లపై పదో ద్వైపాక్షిక సిరీస్​ను గెలుచుకున్న జట్టుగా నిలవనుంది. ఈ ఏడాది ఆఖరి మ్యాచ్​ కానుండటం వల్ల రెండు జట్లు ఈ మ్యాచ్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

India vs West Indies 3rd ODI match preview 2019
భారత్​-వెస్టిండీస్​: ఏడాదిని ఘనంగా ముగించేదెవరు...?

వెస్టిండీస్‌పై పదో ద్వైపాక్షిక సిరీస్‌ గెలుపే లక్ష్యంగా టీమిండియా నేడు నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే కరీబియన్‌ జట్టుపై వరుసగా తొమ్మిది సిరీస్‌లు గెలుపొందింది భారత్‌. కటక్‌ వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ విజయం సాధించి రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉంది.

టాపార్డర్ భారత్​ బలం...

విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు అదరగొట్టేశారు. రోహిత్ శర్మ(159)‌, రాహుల్‌(102) జోడీ సెంచరీలతో చెలరేగింది. తర్వాత రిషభ్‌ పంత్‌(39), శ్రేయస్‌ అయ్యర్‌(53) ధాటిగా ఆడి సాగర తీరంలో సిక్సర్ల మోత మోగించారు. ఒక్క కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డకౌట్‌ మినహాయిస్తే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అత్యద్భుతమనే చెప్పాలి.

బౌలింగ్​తోనే సమస్య...

388 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్‌ను నిలువరించడంలో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఒకానొక సమయంలో వికెట్లు పడగొట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఒక్కసారి షమి వికెట్లు తీయడం ప్రారంభమయ్యాక కోలుకున్నారు పేసర్లు. కుల్‌దీప్‌ హ్యాట్రిక్‌తో మ్యాచ్ గమనం మారిపోయింది. ఈ మ్యాచ్​లో టీమిండియా 107 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా.. బౌలింగ్​ విషయంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి. ప్రధాన పేసర్​ భువనేశ్వర్​ గాయంతో తప్పుకోవడం వల్ల జట్టులోకి వచ్చిన శార్దుల్​.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. జడేజా తన స్పిన్​ బౌలింగ్​తో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు.

ఈ మ్యాచ్​లో భారత్​ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. మూడో వన్డేకు ముందు పేసర్‌ దీపక్‌ చాహర్‌ వెన్నునొప్పి కారణంగా తప్పుకోగా, అతడి స్థానంలో నవ్‌దీప్‌ సైనీ వచ్చాడు.

విండీస్​ టాప్​ సూపర్​...

భారత్​కు తగ్గట్టుగానే విండీస్​ బ్యాటింగ్​ లైనప్​ బలంగానే ఉంది. హెట్‌మెయర్‌, షై హోప్‌ తొలి వన్డేలో చెలరేగారు. ఇద్దరూ శతకాలతో రాణించడం వల్ల చెపాక్‌లో కరీబియన్ జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో హోప్‌(78) ఆకట్టుకున్నా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ కరవయ్యారు. మధ్యలో నికోలస్‌ పూరన్‌(75) ధాటిగా ఆడినా తుదివరకు నిలవలేకపోయాడు. ఒకవేళ కీమో పాల్‌, పొలార్డ్‌, ఛేజ్‌ రాణించి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది.

బౌలింగ్​లో జోరు పెంచాలి...

వెస్టిండీస్​ బౌలింగ్‌ విభాగంలో షెల్డన్‌ కాట్రెల్‌, అల్జారీ జోసెఫ్‌, హోల్డర్‌ కట్టుదిట్టంగా బంతులేసినా పరుగులను నియంత్రించలేకపోయారు. చివరి మ్యాచ్​లో విండీస్​ ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశముంది. వాల్ష్​ స్థానంలో కేరీ పెర్రీ రానున్నాడు.

టాస్​ కీలకం..

తొలి రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన విండీస్‌.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే.. మూడో వన్డేలో పరిస్థితి మారే అవకాశం ఉంది. కటక్‌ మ్యాచ్​లో టాస్‌ ఎవరు గెలిచినా మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపుతారు. ఎందుకంటే ఈ పిచ్‌ విశాఖ మాదిరిగానే పరుగుల వరద పారిస్తుందని సమాచారం. ఫలితంగా టాస్‌ కూడా కీలకంగా మారనుంది.

ఇరుజట్లు అంచనా...

భారత్​:

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషభ్ పంత్​(కీపర్​), కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా, మహ్మద్​ షమీ, శార్దుల్​ ఠాకుర్​, నవదీప్​ సైనీ.

వెస్టిండీస్​:

షై​ హోప్​(కీపర్​), ఎవిన్​ లూయిస్​, షిమ్రన్​ హెట్​మెయిర్​, నికోలస్​ పూరన్​, రోస్టన్​ ఛేజ్​, కీరన్​ పొలార్డ్​(కెప్టెన్​), జేసన్​ హోల్డర్​, కీమో పాల్​, అల్జారీ జోసెఫ్​, షెల్డన్​ కాట్రెల్​,కేరీ పెర్రీ.

ABOUT THE AUTHOR

...view details