తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రివ్యూ: శ్రీలంకతో భారత్ ఢీ.. బుమ్రాపైనే అందరి దృష్టి - virat kohli 2020

కొత్త ఏడాదిలోకి నూతనోత్సహాంతో అడుగుపెట్టిన టీమిండియా.. నేడు శ్రీలంకతో తొలి టీ20లో తలపడనుంది. అసోంలోని గువాహటి ఈ మ్యాచ్​కు వేదిక కానుంది. కొన్ని రోజులుగా విరామంలో ఉన్న జస్ప్రీత్​ బుమ్రా, శిఖర్​ ధావన్​ మైదానంలో అడుగుపెట్టనున్నారు. మంచి ఫామ్​లో ఉన్న రోహిత్​ శర్మ, షమి ఈ సిరీస్​కు దూరమయ్యారు.

India vs Sri Lanka, 1st T20I: Which Team Plays Well in Guwahati Barsapara Stadium to Begin Year with Josh?
ప్రివ్యూ: శ్రీలంకతో భారత్ ఢీ.. ఈ దశాబ్దంలో తొలి టీ20 ఇదే..

By

Published : Jan 5, 2020, 6:31 AM IST

2019ని భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ముగించింది. డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌ను గెలుపొంది జయకేతనం ఎగురవేసింది. 2019లో వన్డే ప్రపంచకప్​ వల్ల ఈ ఫార్మాట్​ పైనే దృష్టి పెట్టిన కోహ్లీసే... ఈ ఏడాది పొట్టి క్రికెట్‌పై కన్నేసింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగడం ఇందుకు కారణం. ఈ మెగాటోర్నీ ముందు భారత్‌ దాదాపు 15 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి 9 వరకు శ్రీలంకతో మూడు పొట్టి ఫార్మాట్​ మ్యాచ్‌లు ఆడనుంది. గువాహటి వేదికగా జరగనున్న తొలి మ్యాచ్​లో విజయం సాధించి.. ఈ ఏడాదికి ఘనస్వాగతం పలకాలని భావిస్తోంది 'మెన్​ ఇన్​ బ్లూ'.

ధావన్‌ ఇన్‌... రోహిత్​ ఔట్​

గతేడాది వరుస శతకాలతో చెలరేగిన టీమిండియా డాషింగ్​ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ... శ్రీలంకతో పొట్టి సిరీస్‌కు దూరమయ్యాడు. అతడికి విశ్రాంతినిచ్చి.. గాయం నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్​ను జట్టులోకి తీసుకుంది టీమిండియా. ఫలితంగా కేఎల్‌ రాహుల్‌కు జోడీగా ఈ దిల్లీ బ్యాట్స్‌మన్‌ బరిలోకి దిగనున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ధావన్‌ శతకంతో చెలరేగి మళ్లీ ఫామ్​ నిరూపించుకున్నాడు. లంకతో తొలి మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడనేదే ఆసక్తికరం.

బుమ్రా ప్రదర్శన కీలకం..

వెన్నునొప్పి కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమైన టీమిండియా స్పీడ్​స్టర్​ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. శ్రీలంకతో తొలి టీ20లో మైదానంలో బంతి అందుకోనున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా బుమ్రా.. రోహిత్​, ధావన్​కు బంతులేశాడు. ఈ మ్యాచ్​కు ముందు నెట్స్​లో విపరీతంగా సాధన చేశాడు.

సంజుకు అవకాశం దక్కేనా..?

టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్‌, డిసెంబర్‌లో జరిగిన బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లకు ఎంపికైనా... తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పుడు శ్రీలంకతో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అతడికి ఆడే అవకాశం వస్తుందో లేదో తెలియదు. గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన సంజూ... సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

స్పిన్​ ద్వయంలో ఎవరు.?

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌లో యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కీలకం. పరిమిత ఓవర్లలో రాణిస్తున్న ఇద్దరూ శ్రీలంకతో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యారు. అయితే ఇద్దరిలో ఒకరికి మాత్రమే తుది జట్టులో అవకాశం లభిస్తుంది. ఆల్​రౌండర్లుగా శివం దూబె, రవీంద్ర జడేజా ఉన్నారు. పేస్ విభాగంలో దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ షమి దూరమవడం వల్ల బుమ్రాకు తోడుగా నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకుర్‌ బరిలోకి దిగనున్నారు.

మలింగ సారథ్యంలో...

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకే మళ్లీ తిరిగొచ్చిన వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ సారథ్యంలో లంక జట్టు ఈ సిరీస్‌కు సన్నద్ధమైంది. జట్టులో ఏంజెలో మాథ్యూస్‌ లాంటి సీనియర్లతో పాటు బానుక రాజపక్స, దసన్‌ ఫెర్నాండో, వైందు రాజా లాంటి అనుభవం లేని వాళ్లూ ఉన్నారు. 2018 ఆగస్టులో చివరిగా టీ20 ఆడిన మాథ్యూస్‌ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అతనితో పాటు ధనంజయ డిసిల్వా కూడా తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు.

నువ్వా-నేనా...

2019ని టీమిండియా వరుస విజయాలతో ముగించగా... శ్రీలంక ఓటములతో భంగపడింది. అక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు వెళ్లిన లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. ఇటీవల పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఓటమిపాలైంది. ఫలితంగా టీమిండియా ఈ సిరీస్​ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది.

భారత జట్టు ఫామ్‌ చూసుకున్నా.. చరిత్ర చూసినా ఈ ఫార్మాట్లో లంకపై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడితే భారత్‌ 11 విజయాలు సాధించింది. లంక ఐదింట్లో నెగ్గింది. నిరుడు నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌, లంక చెరొకటి గెలిచాయి.

ఈ వేదికపై...

గువాహటిలోని బర్సపరా క్రికెట్​ స్టేడియంలో మ్యాచ్​ జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు-118, అత్యధిక స్కోరు-160 పరుగులు నమోదయ్యాయి.

ఇరు జట్లు...

  • భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, సంజు శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్ప్రీత్​ బుమ్రా.

  • లంక జట్టు:

లసిత్‌ మలింగ (కెప్టెన్​), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, దసున్‌ శనక, కుశాల్‌ పెరీరా, నిరోషన్‌ డిక్వెలా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదాన, భానుక రాజపక్స, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్‌ మెండిస్‌, లక్షణ్‌ సందకన్‌, కసున్‌ రజిత.

వేదికలు ఇవే...

తొలి టీ20 మ్యాచ్‌ జనవరి 5న గువాహటి వేదికగా జరగనుంది. రెండో టీ20 జనవరి 7న ఇండోర్ వేదికగా, ఆఖరి టీ20 మ్యాచ్ పుణె వేదికగా జనవరి 10న నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

ABOUT THE AUTHOR

...view details