తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్​ మెరుపులు- రెండో టీ-20లో భారత్​ విజయం

మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్​ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించేసింది టీమిండియా. ఫలితంగా సిరీస్​లో తొలి గెలుపుతో​ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

By

Published : Sep 18, 2019, 10:29 PM IST

Updated : Oct 1, 2019, 3:19 AM IST

సఫారీలపై విరాట్​ సింహగర్జన

మొహాలీ వేదికగా భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. విరాట్​ అర్ధశతకంతో రాణించగా.. ధావన్​ మంచి ప్రదర్శన చేశాడు. కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడిన కోహ్లీకి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ ఆవార్డు దక్కింది.

ధావన్​ శుభారంభం...

క్రీజులో నిలదొక్కుకొనేందుకుఆరంభం నుంచే నెమ్మదిగా ఆడిన రోహిత్​.. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే జోష్​ను ప్రదర్శించే క్రమంలో ఫెలుక్వాయో బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ ​12 పరుగుల(12 బంతుల్లో)వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడం వల్ల 33 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయింది టీమిండియా.

మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ 40 పరుగులు (31 బంతుల్లో; 4ఫోర్లు, 1 సిక్సర్​)చేశాడు. చాలా రోజుల తర్వాత ధావన్​ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం చేసే ఊపులో మిల్లర్​ పట్టిన అద్భుతమైన క్యాచ్​కు పెవిలియన్​ చేరాడు. రోహిత్​ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్​ కోహ్లీతో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ధావన్​.

సారథి సత్తా...

ప్రపంచకప్​, వెస్టిండీస్​ పర్యటనలో తిరుగులేని ఫామ్​ కనబరిచిన విరాట్​ కోహ్లీ.. మరోసారి తన జోరు చూపించాడు. 72 పరుగులు (52 బంతుల్లో; 4 ఫోర్లు, 3సిక్సర్లు)చేసి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ ఆటగాడు రిషబ్​ పంత్(4)​ మరోసారి విఫలమయ్యాడు. చివర్లో వచ్చిన శ్రేయస్​ అయ్యర్​ 16 పరుగులు(14 బంతుల్లో; 2ఫోర్లు)రాణించాడు. ఫలితంగా సిరీస్​లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుని 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో, తబ్రేజ్​, ఫార్చూన్​ తలో వికెట్​ తీసుకున్నారు.

డికాక్​ వల్లే...

టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​గా బరిలోకి దిన రీజా హెండ్రిక్స్​(6) తక్కువ పరుగులకే ఔటయ్య్డాడు. మరో ఓపెనర్​ డికాక్ ​అర్ధశతకంతో రాణించి జట్టును నడిపించాడు. 37 బంతుల్లో 52 పరుగులు(8 ఫోర్లు) సాధించాడు. ఫలితంగా టీ-20ల్లో టీమిండియాపై భారత్​లో అత్యధిక రన్స్​ చేసిన కెప్టెన్​గా రికార్డూ సృష్టించాడు.

సారథికి తోడుగా భవుమా 49 పరుగులు (43 బంతుల్లో; 3 ఫోర్లు, 1సిక్సర్​) చేసి తృటిలో అర్ధశతకం కోల్పోయాడు. డసెన్​(1), మిల్లర్​(18), ప్రిటోరియస్​(1) తక్కువ పరుగులు చేశారు.

భారత బౌలర్లలో దీపక్​ చాహర్​ పొదుపుగా బౌలింగ్​ చేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సైనీ, జడేజా, హార్దిక్​ పాండ్య తలో వికెట్​ తీసుకున్నారు.

ఇప్పటికే ధర్మశాలలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మూడో మ్యాచ్​ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 22న జరగనుంది. ఈ మ్యాచ్​లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్​ సమం అవుతుంది.

Last Updated : Oct 1, 2019, 3:19 AM IST

ABOUT THE AUTHOR

...view details