తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీట్వంటీ సమరానికి సిద్ధమైన భారత కుర్రాళ్లు

మొహాలీ వేదికగా భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు రెండో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది.

By

Published : Sep 18, 2019, 6:16 AM IST

Updated : Oct 1, 2019, 12:41 AM IST

భారత్​Xదక్షిణాఫ్రికా: నేడే రెండో టీ20 మ్యాచ్​

టీమిండియా-సఫారీ జట్లు ఈరోజు మొహాలీ వేదికగా టీ20 మ్యాచ్​లో తలపడనున్నారు. 2015లో సఫారీల చేతిలో సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది కోహ్లీసేన. మ్యాచ్​ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

టీ20 ప్రపంచకప్​ కోసమే...

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో... పొట్టి ఫార్మాట్​పై అందరూ దృష్టి పెట్టారు. యువ ఆటగాళ్లు తమ ప్రతిభ నిరూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. ధోనీ స్థానంలో చోటు దక్కించుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్​ పంత్... తన కెరీర్‌లో తొలిసారి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. 2017లోనే ఈ ఫార్మాట్​లో అడుగుపెట్టిన​ పంత్​పై అంచనాలకు మించి ఆశలుపెట్టుకుంది భారత జట్టు.

ఆడకపోతే వేటు తప్పదు..!

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీతో భారత టాపార్డర్ దుర్భేద్యంగా ఉంది. మిడిల్ ఆర్డర్​లో శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా నిలకడగా ఆడుతున్నారు. నాలుగో స్థానంలో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది.

  1. టీ20 వరల్డ్‌కప్ కోసం బలమైన జట్టుని రూపొందించేందుకు ప్రయత్నాల్లో ఉన్న యాజమాన్యానికి... పంత్​ ప్రదర్శన చాలా ముఖ్యం. ఒకవేళ ఈ సిరీస్​లో అతడు విఫలమైతే... మరో యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కే అవకాశముంది.
  2. చైనామన్​ స్పిన్నర్లు కుల్దీప్​, చాహల్​ను కాదని రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌‌ను పరీక్షించనున్నారు సెలక్టర్లు. ఈ యువ బౌలర్లు తమ సత్తా నిరూపించుకోవాల్సి ఉంది.
  3. బుమ్రాకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్ లాంటి యువ పేసర్లు బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు.
  4. ఆల్​రౌండర్ల జాబితాలో పాండ్య సోదరులిద్దరిలో ఒకరిని తీసుకుంటారో.. లేదా ఇద్దరికీ అవకాశం కల్పిస్తారో చూడాలి.

పేస్​ సఫారీల బలం...

క్వింటన్ డికాక్ సారథ్యంలో ప్రొటీస్ జట్టు భారత్​తో అమితుమీ తేల్చుకోనుంది. బౌలింగ్​లో కగిసో రబాడా, జూనియర్​ డలాతో భారత్​కు ఇబ్బంది తప్పేలా లేదు.

  1. ఫెలుక్వాయో, ఆన్రిచ్ నోర్త్​జే లాంటి బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు.
  2. బ్యాటింగ్​ విభాగంలో డేవిడ్ మిల్లర్, డికాక్, డసెన్ లాంటి టీ-20 స్పెషలిస్టులు టీమిండియాకు సవాల్ విసిరే అవకాశముంది.అయితే డుప్లెసిస్​, హషీమ్​ ఆమ్లా లాంటి అనుభవజ్ఞుల గైర్హాజరుతో... దక్షిణాఫ్రికాలో యువ క్రికెటర్లు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రపంచకప్​లో విఫలమైన ప్రొటీస్ జట్టు భారత్​పై నెగ్గాలని తహతహలాడుతుంది.

నువ్వా-నేనా..?

  1. 2015లో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు వన్డే, టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నాయి. అయితే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో కోల్పోయింది.
  2. వెస్టిండీస్​ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన సఫారీలపైనా అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. మొత్తంగా చూసుకుంటే 2008 నుంచి ఇప్పటివరకు టీ-20 సిరీస్​ల్లో 13-8 తేడాతో ముందంజలో ఉంది భారత జట్టు.

జట్ల వివరాలు

  • భారత జట్టు:

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​ శర్మ (వైస్​ కెప్టెన్​), ధావన్​, కేఎల్​ రాహుల్​, శ్రేయాస్​ అయ్యర్​, మనీష్​ పాండే, రిషభ్​​ పంత్​ (కీపర్​), హార్దిక్​ పాండ్య, రవీంద్ర జడేజా, కృణాల్​ పాండ్య, వాషింగ్టన్​ సుందర్​, రాహుల్​ చాహర్​, ఖలీల్​ అహ్మద్​, దీపక్​ చాహర్​, నవదీప్​ సైనీ.

  • దక్షిణాఫ్రికా జట్టు:

క్వింటన్​ డికాక్ ​(కెప్టెన్​), డసెన్ ​(వైస్​ కెప్టెన్​), తంబే బావుమా, జూనియర్​ డలా, ఫార్చ్యూన్​, బ్యూరెన్​ హెండ్రిక్స్​, రీజా హెండ్రిక్స్​, డేవిడ్​ మిల్లర్​, ఆన్రిచ్ నోర్టజే, ఫెలుక్వాయో, ప్రిటోరియస్​, రబాడ, తబ్రేజ్​ షంశీ, జార్డ్​ లిండే.

Last Updated : Oct 1, 2019, 12:41 AM IST

ABOUT THE AUTHOR

...view details