భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ-20 అహ్మదాబాద్ వేదికగా గురువారం జరగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-2తో వెనుకంజలో ఉన్న టీమ్ఇండియాకు ఈ టీ-20 కీలకం. గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ సిరీస్లో ఇప్పటివరకు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన జట్టే విజయం సాధిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ టాక్ ముఖ్య పాత్ర పోషించనుంది. అయితే రెండు మ్యాచ్ల్లో ఓడి ఒకటి నెగ్గిన కోహ్లీ సేన.. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఇందులో విజయం సాధించడం తప్పనిసరి. టాస్తో సంబంధం లేకుండా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ను ఓడించాల్సి ఉంది.
రాహుల్కు మరో ఛాన్స్ ఇస్తారా?
ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవమైన ఫామ్ టీమ్ఇండియాను కలవరపరుస్తోంది. తొలిమ్యాచ్లో ఒకే ఒక్క పరుగు చేసిన రాహుల్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ కోహ్లీ, టీమ్ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్కు అండగా నిలుస్తున్నారు. టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీనే తమ తొలి ప్రాధాన్యం అని కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో కేఎల్ రాహుల్ను కొనసాగిస్తారా లేదా అనే దానిపై సందేహం నెలకొంది. ఒకవేళ రాహుల్కు విశ్రాంతినివ్వాలని భావిస్తే.. రెండో టీ20లో అర్ధశతకంతో సత్తాచాటిన ఇషాన్ కిషన్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
అప్పుడు సూర్య కుమార్ యాదవ్కు మిడిలార్డర్లో మరోసారి చోటు దక్కనుంది. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసిన రెండుసార్లు పవర్ ప్లే ఓవర్లలో భారత్ ఇబ్బందులకు గురైంది. త్వరగా వికెట్లు కోల్పోయి వేగంగా పరుగులు సాధించలేకపోయింది. తొలిమ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, మూడో మ్యాచ్లో విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో కదంతొక్కినా.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాలను భారత్ ఉంచలేకపోయింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పేసర్లు మార్క్వుడ్, జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లే ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ భారత బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తున్నారు.